Junior doctors: స్టయిఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్.. ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు

  • స్టయిఫండ్ 42 శాతం పెంచాలని విజ్ఞప్తి
  • ఈ నెల 25 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన
  • 26 నుంచి ఓపీ సేవలు బంద్ చేస్తామని హెచ్చరిక
junior doctors strike notice to ap governament

స్టయిఫండ్ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. తమకు చెల్లించే స్టయిఫండ్ ను 42 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఈ నెల 26 నుంచి ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈమేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 26 తేదీ నుంచి ఓపీ విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకుంటే 27వ తేదీ నుంచి అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్య సేవలన్నీ బహిష్కరిస్తామని హెచ్చరించారు. సమ్మెలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ డాక్టర్లు పాల్గొంటారని చెప్పారు. 

ఇతర రాష్ట్రాలకంటే తక్కువ..
మిగతా రాష్ట్రాల్లోని జూనియర్ డాక్టర్లకు అందించే స్టయిఫండ్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ అని జూనియర్ డాక్టర్లు విమర్శించారు. హౌస్ సర్జన్లకు ఇతర రాష్ట్రాల్లో రూ. 30 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.80 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం హౌస్ సర్జన్లకు రూ.19 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.44 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.53 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. కాగా, రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసులు ఇవ్వడం నిజమేనని ఇన్ చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. త్వరలోనే జూనియర్ డాక్టర్ల స్టయిఫండ్ ను ప్రభుత్వం పెంచనుందని వివరించారు.

More Telugu News