Telangana: మునుగోడు ప్రచారంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం!... బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడిని కీర్తించిన రేవంత్‌!

  • మునుగోడు ప్ర‌చారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి
  • ప్ర‌వీణ్ క‌నిపించ‌డంతో ఆయ‌న‌తో చేతులు క‌లిపిన టీపీసీసీ చీఫ్‌
  • త‌మ క‌ల‌యిక యాదృచ్ఛిక‌మేన‌ని వ్యాఖ్య‌
tpcc chief revanth reddy shakes hands with bsp leader rs praveen kumar in munugode bypoll campaign

తెలంగాణ‌లో ఆస‌క్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌ల‌మున‌క‌లై ఉన్నాయి. అధికార టీఆర్ఎస్‌, విప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీల‌తో పాటు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా ఈ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. 3 ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల విధానాల‌ను విమ‌ర్శిస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అన్ని పార్టీలూ బూర్జువా విధానాల‌నే అవలంబిస్తున్నాయ‌ని ఆరోపిస్తున్న ఆయ‌న‌... మునుగోడులో మెజారిటీ ఓట‌ర్లు ఉన్న బీసీ వర్గానికే త‌మ పార్టీ టికెట్ ఇచ్చామ‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో మంగ‌ళవారం మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్ర‌వీణ్ కుమార్ తార‌స‌ప‌డ్డారు. ఈ సందర్భంగా ప్ర‌వీణ్ కుమార్‌తో చేయి క‌లిపిన రేవంత్ ఫొటోల‌కు ఫోజులిచ్చారు. 

అంతేకాకుండా ప్ర‌వీణ్ కుమార్‌ను తాను క‌లిసిన విష‌యాన్ని కూడా ఆయ‌నే వెల్ల‌డించారు. త‌మ క‌ల‌యిక యాదృచ్ఛికమేన‌న్న రేవంత్‌... సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరమ‌ని వ్యాఖ్యానించారు‌. ప్ర‌వీణ్ కుమార్‌ను క‌ల‌వ‌డం త‌న‌కు సంతృప్తినిచ్చింద‌ని కూడా రేవంత్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

More Telugu News