Hyderabad: డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి.. ఎమ్మెల్యే అనుచరులమంటూ వీరంగం, సస్పెండవుతారంటూ హెచ్చరిక

  • పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడిన కేశంపేట వ్యాపారి
  • విషయం తెలిసి వచ్చి పోలీసులతో బంధువుల వాగ్వివాదం
  • ట్రాఫిక్ పోలీసులను నెట్టేసిన వైనం
  • నిందితుడి అరెస్ట్
Man arrested in drunken drive and warns police

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన కొందరు వ్యక్తులు నానా హంగామా చేశారు. తమను వదిలి పెడతారో.. లేదంటే సస్పెండ్ అవుతారో తేల్చుకోవాలంటూ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి రోడ్‌ నంబరు 2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. దాదాపు 2 గంటల సమయంలో ఓ కారును ఆపి డ్రైవర్‌కు శ్వాస పరీక్ష నిర్వహించగా బీఏసీ ఏకంగా 151గా నమోదైంది. అతడిని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన వ్యాపారి టి.కిరణ్‌కుమార్‌రెడ్డి (34)గా గుర్తించారు. వాహనాన్నినిలిపివేశారు. 

విషయం తెలుసుకున్న అతడి బంధువులైన యెన్నం శ్రీధర్‌రెడ్డి (47), మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన హనుమంత్‌రెడ్డి (33), సైదాబాద్‌కు చెందిన వై.శ్రీకాంత్‌రెడ్డి, బోడుప్పల్‌కు చెందిన డ్రైవర్ వి.నరేందర్‌రెడ్డి (31) అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కారును వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. 

తాము ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలీసులను నెట్టేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. కారును విడిచిపెట్టకుంటే ఎమ్మెల్యేకు చెప్పి సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై ఉపేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News