ప్రేమించలేదని యువకుడి కిరాతకం.. నడిరోడ్డుపై బాలిక దారుణ హత్య

dreaded murder in Maharashtras Pune
  • బాలిక కబడ్డీ ప్రాక్టీసుకు వెళుతుండగా ఘటన
  • స్నేహితులతో బైక్‌పై వచ్చి అడ్డగింత
  • వెంటపడుతున్నా ప్రేమించడం లేదని కిరాతకం
  • విచక్షణ రహితంగా పొడిచి పరారీ
మహారాష్ట్రలోని పూణెలో నిన్న నడిరోడ్డుపై జరిగిన బాలిక హత్యోదంతం కలకలం రేపింది. ప్రేమించాలని వెంటపడుతున్నా తిరస్కరిస్తోందన్న కారణంతో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను దూరపు బంధువైన యువకుడు స్నేహితులతో కలిసి అతి దారుణంగా హతమార్చాడు.

నిన్న సాయంత్రం బాలిక పూణెలోని బిబేవాడీ ప్రాంతంలో కబడ్డీ శిక్షణకు వెళుతున్న సమయంలో ముగ్గురు యువకులు బైక్‌పై వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం ముగ్గురూ కలిసి బాలికపై కత్తులతో దాడిచేశారు. విచక్షణ రహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది.

నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రేమించాలని వెంటపడుతున్నా బాలిక నిరాకరిస్తుండడంతో ఆమె దూరపు బంధువైన 22 ఏళ్ల యువకుడే ఈ ఘాతుకానికి తెగబడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Maharashtra
Pune
girl
Murder
Crime News

More Telugu News