Harish Rao: ప్రజలు తెలివైన వారు.. అంతిమంగా పని చేసే వాళ్లకే మద్ద‌తిస్తారు!: మంత్రి హ‌రీశ్ రావు

  • బీజేపీ నేత‌ల‌పై మండిపాటు
  • బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందిస్తున్నారా?
  • తెరాస తెలంగాణ కోసం, ప్రజల కోసం పని చేసే పార్టీ
  • 90.5 శాతం మంది ప్రజలకు రేషన్ బియ్యం అందుతోందన్న మంత్రి   
harish rao slams bjp

బీజేపీపై తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియంలో కొత్త రేషన్ కార్డులు, కల్యాణ‌ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... తాము నూతనంగా 3,09,083 రేష‌న్‌ కార్డులను అందిస్తున్నామ‌ని చెప్పారు. దీని వ‌ల్ల‌ 8,65,430 మంది లబ్ధి పొందుతున్నార‌ని చెప్పారు.

అలాగే, త‌మ సర్కారు నెలకు అదనంగా 14 కోట్ల రూపాయ‌ల‌ విలువగల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంద‌ని తెలిపారు. సంవత్సరానికి రేషన్ పై రూ. 2766 కోట్ల నిధుల్ని వెచ్చిస్తోందని చెప్పారు. అదనంగా ఇచ్చిన కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు ఉన్నాయ‌ని, లబ్ధిదారులు 2 కోట్ల 88లక్షల మంది ఉన్నారని మంత్రి చెప్పారు.

ప్రతి నెల దాదాపు 231 కోట్ల రూపాయ‌ల‌ను, సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలను ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 90.5 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తోందన్నారు.

ప్ర‌తి పేదవాడి కడుపు నింపడమే‌ కేసీఆర్ లక్ష్యమ‌ని చెప్పారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా 90.5 శాతం ప్రజలకు బియ్యం ఇస్తున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కొందరు బీజేపీ నేతలు కల్యాణ లక్ష్మి పథకాన్ని పరిగె ఎరుకోవడంతో పోల్చారని ప్రస్తావిస్తూ మంత్రి మండిప‌డ్డారు.

బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందిస్తున్నారా? అని ఆయ‌న నిల‌దీశారు. తెరాస ఎన్నికల కోసమే పనులు‌ చేస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, తెరాస తెలంగాణ కోసం, ప్రజల కోసం పని చేసే పార్టీ అని చెప్పుకొచ్చారు. ప్రజలు తెలివైన వారని, అంతిమంగా పని చేసే వాళ్లకే తమ మద్ద‌తిస్తార‌ని అన్నారు.

More Telugu News