బాబు రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ.. జగన్ రాయలసీమ రత్నం: రాచమల్లు శివప్రసాద్రెడ్డి
- జగన్ ను విమర్శించడమే చంద్రబాబు, లోకేశ్ ఏకైక పనిగా పెట్టుకున్నారన్న రాచమల్లు
- లోకేశ్ కడప జిల్లా పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని ఎద్దేవా
- అమరావతి రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపాటు
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దగా చేస్తోందని... చంద్రబాబు, లోకేశ్ వైసీపీ అధినేత జగన్ ను విమర్శించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. లోకేశ్ కడప జిల్లా పర్యటన వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని, కేవలం జగన్పై నిందలు వేయడానికే ఆయన వచ్చారని విమర్శించారు. వివేకా హత్య కేసులో జగన్కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ, సుప్రీం కోర్టు స్పష్టం చేసినా... కూటమి నేతలు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని.. జగన్ రాయలసీమ రత్నం అని వ్యాఖ్యానించారు.
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని రాచమల్లు విమర్శించారు. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీలతో రైతులకు తోడ్పాటు అందించిన జగన్ వ్యవసాయాన్ని పండుగ చేసిన నాయకుడని కొనియాడారు. అమరావతిలో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో నిర్మించిన స్కూళ్లను చూపిస్తూ లోకేశ్ షోకులు పడుతున్నారని, 18 మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక కూటమి సర్కార్ చేతులెత్తేసిందని విమర్శించారు.