పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. 'వీజీఎఫ్ విప్లవం'పై సీఎం చంద్రబాబు దృష్టి

Chandrababu Naidu focuses on VGF revolution for rapid development through PPP
  • భవిష్యత్తులో వీజీఎఫ్ విప్లవం ఖాయమన్న సీఎం చంద్రబాబు
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగంగా అభివృద్ధి సాధ్యమని వెల్లడి
  • త్వరలో 'పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0'కు రూపకల్పన
  • పీపీపీ కింద రూ.1.23 లక్షల కోట్ల విలువైన 260 ప్రాజెక్టులు 
  • నిరర్ధక ప్రభుత్వ ఆస్తులను అవకాశాలుగా మార్చుకోవాలని ఆదేశం
రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానమే కీలకమని, భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)తో కూడిన ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులు తేనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే 'ఆంధ్రప్రదేశ్ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0'ను కేబినెట్ ముందుకు తీసుకురావాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పర్యాటకం సహా వివిధ రంగాల్లో రూ.1,23,229 కోట్ల విలువైన 260 ప్రాజెక్టులు పీపీపీ విధానంలో పురోగతిలో ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. పీపీపీ కింద చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణ విధానాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని, ఈ ప్రాజెక్టులకు రూ.1,468 కోట్ల వీజీఎఫ్ రానుందని తెలిపారు. అలాగే, విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు కేంద్రం రూ.178 కోట్ల వీజీఎఫ్ అందిస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతీ ప్రాజెక్టును ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా సస్టెయినబుల్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని సూచించారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టులలో స్థానిక మత్స్యకారులను భాగస్వాములను చేసి వారికి ప్రయోజనం చేకూర్చాలన్నారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వం వద్ద నిరుపయోగంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మార్చుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని బస్టాండ్ల వద్ద ఉన్న భూములను వాణిజ్యపరంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ శాఖ ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఫైనాన్షియల్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. బలహీన వర్గాల విద్యార్థులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు, రెసిడెన్షియల్ హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh PPP Policy
Viability Gap Funding VGF
AP Infrastructure Projects
Public Private Partnership AP
Andhra Pradesh Economic Growth

More Telugu News