Google: గూగుల్ కు రూ.4 వేల కోట్ల జరిమానా వడ్డించిన ఫ్రాన్స్

  • గూగుల్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మీడియా సంస్థలు
  • తమ కంటెంట్ ను వాడుకుంటోందని ఆరోపణ
  • వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రభుత్వం
  • ఆదేశాలను పట్టించుకోని గూగుల్
France imposes huge fine over Google

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కు ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ జరిమానా వడ్డించింది. వార్తల ప్రచురణ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోకుండా, వాటి కంటెంట్ ను నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటోందని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గూగుల్ కు చెందిన గూగుల్ న్యూస్ పేజ్ లో తమ కంటెంట్ ను అనుమతి లేకుండా వినియోగిస్తున్నారంటూ అనేక ఫ్రెంచ్ మీడియా సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.

ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఫ్రాన్స్ ప్రభుత్వ అధీనంలోని యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ గూగుల్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించింది. అయితే, గూగుల్ కు ఓ అవకాశం ఇవ్వాలని భావించి, స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను గూగుల్ పెడచెవిన పెట్టడంతో రెగ్యులేటరీ భారీ జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, గూగుల్ కు రూ.4,415 కోట్ల మేర జరిమానా వడ్డించింది.

గూగుల్ తమ న్యూస్ కంటెంట్ ను వాడుకుంటూ వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆదాయం పొందుతోందని వార్తా సంస్థలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నాయి. కాగా, తాజా పరిణామంపై గూగుల్ నుంచి ఇంకా స్పందన రాలేదు.

More Telugu News