Somireddy Chandra Mohan Reddy: తిరుప‌తి వైసీపీ శ్రేణుల‌ను చూస్తే జాలేస్తోంది: సోమిరెడ్డి

  • వాలంటీర్ల‌కు ఐదు వేల రూపాయ‌ల చొప్పున ఇచ్చారు
  • వైసీపీ నేత‌ల‌ను జ‌గ‌న్ డ‌మ్మీగా మార్చేశారు
  • వాలంటీర్లే వైసీపీకి ఓట్లు వేయిస్తారని జ‌గ‌న్ భావిస్తున్నారు
somireddy slams jagan

తిరుప‌తి వైసీపీ శ్రేణుల‌ను చూస్తే జాలేస్తోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో వాలంటీర్ల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ ఐదు వేల రూపాయ‌ల చొప్పున ఇచ్చి వారితోనే ఓట‌ర్ల‌కు పంపిణీ చేయిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌భుత్వ వేత‌నం తీసుకుంటోన్న వారిని వైసీపీ రాజ‌కీయాల‌కు వాడుకుంటుండ‌డం స‌రికాద‌ని చెప్పారు.

ఎన్నిక‌లో గెల‌వ‌డం కోసం వాలంటీర్ల‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లుగా వాడుకోవ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.  తిరుపతి ఉప ఎన్నికలో వాలంటీర్ల‌తోనే త‌తంగం అంతా న‌డిపించాల‌ని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ శ్రేణుల పనైపోయిందని, వారిని చూస్తే జాలేస్తోందని ఆయ‌న వ్యాఖ్యానించారు.

వాలంటీర్లే వైసీపీకి ఓట్లు వేయిస్తారని, వారే పెత్తనం చేస్తారని, ఇత‌ర వైసీపీ నేత‌లు చూస్తూ ఉండాల‌నే నిర్ణయానికి జగన్ వచ్చారని  సోమిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉప ఎన్నిక జ‌రుగుతున్న నియోజకవర్గంలో వాలంటీర్లంద‌రికీ క‌లిపి రూ.11 కోట్ల వరకు పంచారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.  

వైసీపీ నాయకులు, కార్యకర్తలను జ‌గ‌న్ డమ్మీలుగా మిగిల్చేశారని ఆయ‌న అన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి వాలంటీర్లకు గౌరవవేతనం ఇస్తూ వారితో రాజకీయం చేయించడం స‌రికాద‌ని చెప్పారు. రేపు ఇంకో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే‌సి టీచర్లను, రెవెన్యూ అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటామంటే వ్యవస్థలు ఏమైపోతాయని ఆయ‌న ప్రశ్నించారు.

More Telugu News