డబ్బులు ఇస్తామని ఫోన్ కాల్.. గుండుకొట్టించుకున్న మహిళలు!

Salem women shave heads for money after fake phone call
  • తమిళనాడులోని సేలంలో ఘటన
  • జట్టు ద్వారా కొత్త రకం వ్యాధి వ్యాపిస్తోందని మహిళలకు ఫోన్
  • గుండు కొట్టించుకుంటే ప్రభుత్వం రూ. 15 వేలు ఇస్తుందన్న కేటుగాళ్లు 
  • డబ్బు ఆశతో గుండు కొట్టించుకున్న మహిళలు
  • తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లడంతో బయటపడిన మోసం
తమిళనాడులోని సేలంలో దారుణ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పథకం పేరిట కొందరు కేటుగాళ్లు మహిళలను నమ్మించి వారు గుండు గీయించుకునేలా చేశారు.  జుట్టు ద్వారా ఓ కొత్త వ్యాధి వ్యాపిస్తోందని, గుండు చేయించుకుంటే దాన్ని నివారించవచ్చని నమ్మబలికి ఈ మోసానికి పాల్పడ్డారు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా అత్తూరు సమీపంలోని పుదుక్కోత్తంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళకు జులై 26న రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను అత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ వ్యక్తి, కరోనా తరహాలోనే ఓ కొత్త వ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తోందని చెప్పాడు. దీని నివారణకు ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిందని, గుండు చేయించుకున్న మహిళలకు రూ.15,000, కాలేజీ విద్యార్థినులకు రూ.45,000, పురుషులకు రూ.6,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోందని నమ్మబలికాడు.

తన మాటలు నమ్మేందుకు, గుండు చేయించుకున్న మహిళల ఫొటోలు, రూ.500 నోట్ల కట్టల చిత్రాలను అదే నంబర్ నుంచి ఆమె వాట్సాప్‌కు పంపించాడు. ఇది నిజమని నమ్మిన ఆ మహిళ, ఈ విషయాన్ని తన ఇరుగుపొరుగు వారికి చెప్పింది. ఈ సమాచారంతో చిత్ర (63), రామాయి (62), కావేరి (64) అనే ముగ్గురు మహిళలు వెంటనే స్థానిక సెలూన్‌కు వెళ్లి గుండు చేయించుకున్నారు.

అనంతరం డబ్బుల కోసం తమకు ఫోన్ చేసిన వ్యక్తికి కాల్ చేయగా, అతడి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అనుమానంతో మంగళవారం వారు అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లి విచారించగా, అలాంటి పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మోసంతో సంబంధం ఉందన్న అనుమానంతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Salem
Tamil Nadu scam
Shaved head fraud
Fake government scheme
Salem women tonsuring
Money for hair scam

More Telugu News