Paddagattu: పెద్దగట్టు జాతరలో మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ మంత్రులు

Telangana ministers visits Peddagattu carnival
  • ప్రారంభమైన పెద్దగట్టు జాతర
  • ఈ ఉదయం లింగమంతులస్వామిని దర్శించుకున్న మంత్రులు
  • ప్రత్యేక పూజలు చేసిన తలసాని, జగదీశ్ రెడ్డి
  • నిధులు మంజూరు చేశారంటూ కేసీఆర్ ను కొనియాడిన వైనం
తెలంగాణాలో మేడారం జాతర తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన జాతరగా సూర్యాపేట జిల్లాలో జరిగే పెద్దగట్టు జాతరకు గుర్తింపు ఉంది. ఇక్కడ నిర్వహించే లింగమంతులస్వామి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.

తాజాగా పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభం కాగా, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి ఈ ఉదయం విచ్చేశారు. ఇక్కడి లింగమంతులస్వామికి భక్తిప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దగట్టు క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ, లింగమంతులస్వామి యాదవుల ఇలవేల్పు అని వెల్లడించారు. ఎంతో మహిమాన్వితుడైన స్వామి కరుణా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చారంటూ సీఎం కేసీఆర్ ను కొనియాడారు. పెద్దగట్టు జాతరకు నిధులు మంజూరు చేశారని వెల్లడించారు.

మరో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దగట్టు జాతర విశిష్టతను మరింత పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. యాదవులపై ఉన్న అభిమానంతో ఆయన పెద్దగట్టు జాతరకు భారీగా నిధులు ఇచ్చారని వివరించారు.
Paddagattu
Carnival
Talasani
G Jagadish Reddy
KCR
Telangana

More Telugu News