Bhuma Akhila Priya: ఆ ఫోన్ కాల్ వల్లే.. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా దొరికిపోయిందట!

  • గత వారంలో కలకలం రేపిన కిడ్నాప్ కేసు
  • డీసీపీకి వచ్చిన ఫోన్ నంబర్ నుంచే అఖిలప్రియకు కాల్స్
  • కేసులో మొత్తం 19 మంది నిందితులు
One Call Clue that gives Police on Akhilapriya

బోయిన్ పల్లికి చెందిన ప్రవీణ్ రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ ఏ1గా దొరకడానికి కారణం ఒక ఫోన్ కాల్ అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అప్పటివరకు అఖిలప్రియ అనుమానితుల్లో ఒకరుగా మాత్రమే వున్నారు. ఈ కేసులో నిందితులు హై ప్రొఫైల్ వ్యక్తులు కావడంతో పోలీసు అధికారులు పక్కా ఆధారాల కోసం వెతికారు. అదే సమయంలో, పోలీసులకు ఒక క్లూ లభించింది. అదే అఖిలప్రియను ఏ1గా మార్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చారు.

ఈ కిడ్నాప్ చేసే ముందు పట్టుబడిన నిందితులు ఆరు సిమ్ కార్డులను తమ ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలు ఇచ్చి కొనుగోలు చేశారు. ఇక కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి, మీడియాలో విస్తృతంగా వార్తలు రావడం, ఆపై పోలీసుల సోదాలు ముమ్మరం కావడంతో నిందితులను విడిచి పెట్టాలని నిర్ణయించుకున్న కిడ్నాపర్లు, నార్త్ జోన్ డీసీపీకి అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేశారు. వారు ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని కలిపి మాట్లాడించారు. అంతకుముందు అదే ఫోన్ నుంచి కిడ్నాపర్లు అఖిలప్రియకు కాల్ చేశారు. అదే పోలీసులకు పెద్ద క్లూను అందించింది.

ఆ ఫోన్ నంబర్ అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ వద్ద పీఏగా పనిచేస్తున్న గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్ దిగా గుర్తించారు. దీంతో అతనిని అరెస్ట్ చేశారు. అదే ఫోన్ నుంచి కడప జిల్లాకు చెందిన డ్రైవర్ బాల చెన్నయ్యకు, ఆళ్లగడ్డకు చెందిన సంపత్ కు ఫోన్లు వెళ్లడంతో వారినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కిడ్నాప్ వ్యవహారమంతా అఖిలప్రియ ఆధ్వర్యంలో జరిగిందని నిందితులను విచారించి తెలుసుకున్న పోలీసులు, ఆ మేరకు కోర్టుకు విన్నవించారు.

More Telugu News