Nara Lokesh: మృగాళ్లు రెచ్చిపోతుంటే సీఎం జగన్ మౌనం దాల్చడం సరికాదు: నారా లోకేశ్

  • విజయవాడలో బీటెక్ విద్యార్థిని హత్య
  • దారుణమని పేర్కొన్న లోకేశ్
  • ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు
Nara Lokesh responds to Vijayawada BTech student murder

విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే బీటెక్ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది కిరాతకం కారణంగా కన్నుమూసింది. నాగేంద్రబాబు అలియాస్ స్వామి అనే యువకుడు దివ్య తేజస్వినిని గొంతు కోసి హత్య చేశాడు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న దివ్య ఓ ప్రేమోన్మాది చేతిలో బలి కావడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని , వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారం రోజుల వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు జరగడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. వరుసగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ మౌనం దాల్చడం సరికాదని విమర్శించారు. చట్ట రూపం దాల్చని దిశ చట్టం, ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లు, అధికారం లేని హోంమంత్రి... ఇక మహిళలకు న్యాయం జరిగేదెప్పుడు? అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News