Sajjala Ramakrishna Reddy: ప్రతిపక్షమే మీడియా నోరు నొక్కేయడం విడ్డూరంగా ఉంది: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల

  • మీడియాలో కథనాలు ప్రసారం కాకుండా కోర్టుకు వెళుతున్నారని ఆరోపణ
  • చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటున్నారని అసహనం
  • మీడియా నోరు నొక్కేయడం అతిగా ఉందన్న సజ్జల
 AP Government adviser Sajjala Ramakrishna Reddy slams opposition on media issues

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకుండా కోర్టుకు వెళుతున్నారని, ప్రతిపక్షమే మీడియా స్వేచ్ఛను హరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో అధికార పక్షం మీడియా స్వేచ్ఛను కాలరాసిందని విన్నామని, కానీ ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణలో తొందరపాటు ఏమీ లేదని, తప్పులపై విచారణ జరగకుండా  అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఏదైనా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి భూములపై విచారణకు నియమించిన సిట్ స్వతంత్ర విచారణ సంస్థ అని సజ్జల స్పష్టం చేశారు.

టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వొకేట్ జనరల్ గా పదవి ఇచ్చారని, అతనిపై ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటి ఆధారంగానే కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాలపై మీడియాలో కథనాలు రావొద్దంటూ న్యాయస్థానాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా నోరు నొక్కేయడం కొంచెం అతిగా అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు.

More Telugu News