Panchakarla Ramesh Babu: వైసీపీ కండువా కప్పుకున్న పంచకర్ల రమేశ్ బాబు

  • వైసీపీలో చేరిన పంచకర్ల
  • పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
  • గత ఎన్నికల్లో ఓటమిపాలైన పంచకర్ల
Panchakarla Ramesh Babu joins YCP

టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేశ్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. రమేశ్ బాబుకు సీఎం జగన్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ తదితరులు కూడా విచ్చేశారు.

 రమేశ్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రజారాజ్యం తరఫున పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ లతో పాటు పంచకర్ల కూడా టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో పరాజయం ఎదురైంది. అప్పటినుంచి టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

More Telugu News