Rajamouli: 'ఆర్ఆర్ఆర్' ట్రయల్ షూట్ ఆలోచనను విరమించుకున్న రాజమౌళి!

  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చిత్రం
  • లాక్ డౌన్ కారణంగా ఆగిన షూటింగ్
  • ట్రయల్ షూట్ ఆలోచనను విరమించుకున్నట్టు వార్తలు
Rajamouli Withdraws RRR Trail Shoot

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ చాలా వరకూ ముగిసింది కూడా. ఈ లోగా కరోనా వైరస్ రావడం, లాక్ డౌన్ తో మిగిలిన షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు నిబంధనలను సడలించడంతో, ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా షూటింగ్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ మాస్టర్ సాబు శిరిల్ నేతృత్వంలో సినిమా ట్రయల్ షూట్ ను చేయాలని రాజమౌళి భావించారు. భౌతిక దూరం పాటిస్తూ, రెండు రోజులు షూట్ చేసి చూడాలని ఆయన అనుకున్నారు. అయితే, దీనికి కూడా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వుండగా, సమయానికి అనుమతి లభించలేదు.

ఇక ఇప్పుడు హైదరాబాద్ లో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటం, కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రయల్ షూట్ ఆలోచనను రాజమౌళి విరమించుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాల్సిందే.

More Telugu News