Congress: ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి.. వేదికపైనే మాటల యుద్ధం!

  • నల్గొండ కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు విధానంపై సమావేశం
  • నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం మీ పార్టీ వాళ్లకే ఇష్టం లేదన్న జగదీశ్ రెడ్డి
  • నువ్వు మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టమన్న ఉత్తమ్
Uttamkumar Reddy vs Jagadish Reddy

నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నువ్వెంత? అంటే నువ్వెంత? అని సవాలు విసురుకున్నారు. గొంతు తగ్గించి మాట్లాడాలని ఒకరు, నువ్వేంది? నీ లెక్కేంది? అని మరొకరు వేదికపైనే దూషణల పర్వం కొనసాగించారు. దీంతో వేదికపై ఉన్న వారు విస్తుపోయారు.  

ఆ వివరాల్లోకి వెళితే, నియంత్రిత సాగు విధానంపై కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ గురించి వివరిస్తున్నారు. మధ్యలోనే కల్పించుకున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ‘నిజంగా రుణమాఫీ జరిగిందా?’ అని ప్రశ్నించారు.

స్పందించిన జగదీశ్ ‌రెడ్డి ‘మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీ పాలనలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో క్వింటాల్ ధాన్యాన్ని రూ. 1000కే అమ్ముతున్నారు. నీకెంతకావాలో చెప్పు పంపిస్తా’’ అని బదులివ్వడంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రూ. 1200 కొంటున్నామని ఉత్తమ్ బదులివ్వగా, మీటింగ్‌లో మర్యాద తప్పింది మీరేనని జగదీశ్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీంతో మర్యాదగా మీటింగ్ కొనసాగించాలని ఉత్తమ్ కోరారు.  

ఉత్తమ్ మాటలకు స్పందించిన జగదీశ్ రెడ్డి ఇది అసెంబ్లీ కాదని, ఇక్కడ చర్చ జరగడం లేదని అన్నారు. తాను ఏం చెప్పాలనుకున్నానో అదే చెబుతానని, తనకు ఆ హక్కు ఉందని అన్నారు. అంతేకాదు, ఆఫ్ట్రాల్ నువ్వేంది? నీ లెక్కేంది? అని ఉత్తమ్‌ను ప్రశ్నించారు. ‘‘నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచావ్. రుణమాఫీ అందలేదా? మా సీఎం లెక్కలతో వివరిస్తుంటే ప్రిపేర్ అయి రాలేదని సభ నుంచి పారిపోలేదా?’’ అని నిలదీశారు. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం మీ పార్టీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదని అన్నారు.  

మంత్రి మాటలతో  ఆగ్రహంతో ఊగిపోయిన ఉత్తమ్ ఒక్కసారిగా ఆయనవైపు వచ్చి ‘మరి నీలెక్కేంది?’ అని ప్రశ్నించారు. తానేమీ పారిపోలేదని అన్నారు. మంత్రిగా ఉండి పచ్చి అబద్ధాలు చెబుతున్నావని, నువ్వు మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టమని అన్నారు. దీంతో కల్పించుకున్న మంత్రి.. నేను మాట్లాడేది వినండి. రాసుకోండి, సభా మర్యాద పాటించండి అని కోరడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది.

More Telugu News