పోలీసులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ
- ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన వంశీ
- సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం అంటూ ఆరోపణలు
- పోలీసులు కేసు నమోదు చేయడంలేదని అసంతృప్తి
ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసినా గన్నవరం పోలీసులు ఇంతవరకు స్పందించలేదని, కేసు నమోదు చేయలేదని వంశీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం పోలీసులు తన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వంశీ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. విచారణ సందర్భంగా, కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.