Dhawan: వరల్డ్ కప్ ఆడలేకపోతున్నానంటూ బాధపడుతున్న క్రికెటర్ ను ఊరడించిన ప్రధాని మోదీ

ఎన్నో ఆశలతో వరల్డ్ కప్ లో ఆడుగుపెట్టి శతకంతో రాణించిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అనూహ్యరీతిలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ప్యాట్ కమిన్స్ విసిరిన ఓ బంతి ధావన్ చేతి వేలును గాయపర్చింది. ఆ మ్యాచ్ లో గాయంతోనే బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తిచేసుకున్న ధావన్ ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. గాయం తీవ్రమైనది కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. చేతి వేలి ఎముక చిట్లిన నేపథ్యంలో, ఇక తాను ప్రపంచకప్ కు దూరమయ్యానని తెలుసుకున్న ధావన్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

ఎంతో ఎమోషనల్ గా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని కూడా ఆకర్షించింది. వెంటనే ఆయన ట్విట్టర్ లో స్పందించారు. "ప్రియమైన ధావన్, క్రికెట్ పిచ్ నీలాంటి ఆటగాడ్ని మిస్సవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నువ్వు త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టగలవని ఆశిస్తున్నాను. దేశానికి ఎప్పట్లాగానే మరిన్ని విజయాల్లో భాగస్వామ్యం అందిస్తావని భావిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
Dhawan
Narendra Modi
Cricket

More Telugu News