పనుల్లో అలసత్వం వహిస్తే క్రిమినల్ కేసులు.. జైలుకే: కాంట్రాక్టర్లకు నిమ్మల రామానాయుడు సీరియస్ వార్నింగ్
- పుష్కర ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
- పనుల పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించిన నిమ్మల రామానాయుడు
- పనుల్లో వైఫల్యానికి కారణమైన ఈఈకి మెమో జారీ చేయాలని ఆదేశం
పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం వహించడంపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో పాటు కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించిన వర్క్ షెడ్యూల్ ప్రకారం పనులు వేగంగా జరగకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజాధనానికి నష్టం కలిగిస్తూ, ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడానికి కూడా వెనుకాడబోమని కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. పనుల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యుడైన సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కి మెమో జారీ చేయాలని ఈఎన్సీని ఆదేశించారు. ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని గుర్తుచేసిన మంత్రి, ఈ నెలాఖరులోపు సీఎం పనులను స్వయంగా సమీక్షించే అవకాశం ఉన్నందున అధికారులు ప్రతిరోజూ 'వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్' అందించాలని హెచ్చరికలు జారీ చేశారు.