యూపీలో వైద్యుల నిర్వాకం...రోగికి తెగిపడిన కాలునే తలగడగా పెట్టిన వైనం...!
- స్థానిక టీవీ ఛానల్ ప్రసారంతో వెలుగులోకి వచ్చిన ఘటన
- ఘటనపై రెండు రకాల వాదనలు తెరపైకి
- నిజానిజాల నిగ్గు తేల్చేందుకు దర్యాప్తుకు ఆదేశించామన్న ఆసుపత్రి యాజమాన్యం
రోగి కాలును అతనికి తలగడగా ఉంచామంటూ తమపై వస్తున్న ఆరోపణలను ఆసుపత్రి వైద్యులు తోసిపుచ్చుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సాధన కౌషిక్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు విరిగిపోయిన బాధితుడి కాలును అతని కుటుంబసభ్యులే ఆసుపత్రికి తీసుకొచ్చారని కొందరు చెబుతుండగా...మరికొందరేమో అతని కాలును వైద్యులే తొలగించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాల నిగ్గుతేల్చేందుకు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ హరిశ్చంద్ర ఆర్య తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ఆసుపత్రుల్లో స్వీపర్లు, వార్డు బాయ్లు రోగులకు చికత్స చేస్తున్నారని, చివరకు చిన్న చిన్న సర్జరీలు కూడా వారే చేస్తున్నారన్న వార్తల నడుమ ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.