భారత రిఫైనరీలకు కొత్త కష్టం.. సౌదీ ఆరామ్‌కో నుంచి చమురు సరఫరా బంద్‌?

భారత రిఫైనరీలకు కొత్త కష్టం.. సౌదీ ఆరామ్‌కో నుంచి చమురు సరఫరా బంద్‌?

Saudi Aramco Halts Crude Oil Supply to Indian Refineries
  • తదుపరి ఆదేశాల వరకు సరఫరాలు నిలిచే అవకాశం
  • భారత్‌ క్రూడ్‌ దిగుమతుల్లో సౌదీ వాటా కీలకం
  • 105 డాలర్లపైనే కొనసాగుతున్న బ్రెంట్‌ ధర
  • రష్యా క్రూడ్‌ డిస్కౌంట్లు తగ్గడంతో ఖరీదైన ప్రత్యామ్నాయాలు
భారత రిఫైనరీలకు సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో ముడి చమురు సరఫరాను నిలిపివేసినట్లు ‘ది ఎకనామిక్‌ టైమ్స్‌’ నివేదించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సరఫరాలు నిలిచిపోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ తెలిపింది. ఇప్పటికే పెరిగిన క్రూడ్‌ ధరలు, ట్యాంకర్‌ రవాణా ఛార్జీలు, సంప్రదాయ సరఫరా మార్గాల్లో అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్న భారత రిఫైనరీలకు ఇది మరో సవాలుగా మారింది.

సౌదీ నుంచి భారత్‌కు క్రూడ్‌ సరఫరా కీలకంగా ఉంది. పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి భారత్‌ దిగుమతి చేసుకున్న క్రూడ్‌లో సుమారు 9 శాతం ఆరామ్‌కో నుంచే వచ్చినట్లు నివేదిక పేర్కొంది. అయితే సౌదీ సరఫరాలు ఆగిపోవడంతో వెంటనే క్రూడ్‌ దొరకదనే సమస్య కంటే.. ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేసే చమురు ధర ఎంత ఉంటుందన్నదే రిఫైనరీలకు ప్రధాన ఆందోళనగా మారింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. బుధవారం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు సుమారు 108 డాలర్లకు చేరింది. ఆ తర్వాత కొంత తగ్గినా 105 డాలర్లపైనే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సౌదీ నుంచి వచ్చే చమురుకు బదులుగా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే అదనపు వ్యయం తప్పకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే సమయంలో చమురు రవాణా చేసే ట్యాంకర్లకు చార్జీలు కూడా పెరిగాయి. రష్యా క్రూడ్‌పై గతంలో లభించిన డిస్కౌంట్లు తగ్గిపోవడం లేదా పూర్తిగా కనుమరుగవడం కూడా రిఫైనరీలపై ఒత్తిడిని పెంచుతోంది. దీంతో భారత్‌ ఇతర ఉత్పత్తిదారులు, ప్రాంతాల నుంచి క్రూడ్‌ను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అయితే సౌదీ క్రూడ్‌ పూర్తిగా మార్కెట్‌ నుంచి మాయమైనట్లు కాదు. ఆరామ్‌కో కొన్ని క్రూడ్‌ కార్గోలను స్పాట్‌ మార్కెట్‌లో వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఈటీ తెలిపింది. వీటిలో కొంత చమురు హోర్ముజ్‌ జలసంధి మీదుగా భారత రిఫైనరీలకు చేరే అవకాశం ఉంది. అయితే సాధారణ దీర్ఘకాలిక ఒప్పందాలతో పోలిస్తే స్పాట్‌ కార్గోల సరఫరా, ధరల్లో స్థిరత్వం తక్కువగా ఉండొచ్చు.

భారత రిఫైనరీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ సరఫరాదారుల నుంచి చమురు కొనుగోలు చేయడంతో పాటు అందుబాటులో ఉన్న స్పాట్‌ కార్గోలను వినియోగించాల్సి రావచ్చు. క్రూడ్‌ ధరలు ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే దేశం మొత్తం చమురు దిగుమతి బిల్లుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సౌదీ సరఫరాలపై ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయి? గల్ఫ్‌ ప్రాంతంలో సాధారణ చమురు రవాణా ఎప్పుడు పునరుద్ధరిస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
Advertisement
Saudi Aramco
Indian refineries
Crude oil supply
Brent crude price
Oil import bill
Energy crisis India

More Telugu News