ఆర్థిక వృద్ధిలో రికార్డ్.. సెమీకండక్టర్ రంగంలో దూకుడు.. భారత్‌పై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోంది: ప్రధాని మోదీ

ఆర్థిక వృద్ధిలో రికార్డ్.. సెమీకండక్టర్ రంగంలో దూకుడు.. భారత్‌పై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోంది: ప్రధాని మోదీ

PM Modi Record Economic Growth and Semiconductor Progress Global Confidence in India Increasing
  • సెమీకాన్ ఇండియా 2026ను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • భారత్ ఆర్థిక వృద్ధి, ప్రపంచ విశ్వాసానికి సెమీకండక్టర్ల రంగం నిదర్శనమని వ్యాఖ్య
  • ప్రపంచమంతా భారత చిప్స్ వెళతాయ‌ని ధీమా వ్యక్తం చేసిన మోదీ
  • సెమీకాన్ 2.0 కింద 200 చిప్-డిజైన్ స్టార్టప్‌లకు మద్దతిస్తామని వెల్లడి
  • నాలుగేళ్లలోనే 70,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చామన్న‌ అశ్విని వైష్ణవ్
ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దేశంపై అంతర్జాతీయ విశ్వాసం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో చోటుచేసుకుంటున్న అభివృద్ధి దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గురువారం సెమీకాన్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. "ప్రపంచం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. ఇది మన ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను చూపుతోంది. గడిచిన 15 రోజుల్లో జరిగిన పరిణామాలే దీనికి ఉదాహరణ" అని తెలిపారు. 

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఏజెంటిక్ ఏఐ, టోకెనైజేషన్, క్వాంటం టెక్నాలజీ వంటి అంశాలపై చర్చ జరిగిందని, అలాగే దేశవ్యాప్తంగా దాదాపు 3,000 కిలోమీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు కార్యకలాపాలు ప్రారంభించాయని గుర్తుచేశారు. ఈ కారిడార్లు దేశంలో సరుకు రవాణాను వేగవంతం చేసి, లాజిస్టిక్స్ రంగాన్ని మెరుగుపరచడమే కాకుండా తయారీ రంగానికి కొత్త ఊపు ఇస్తాయని వివరించారు.

సెమీకండక్టర్ రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. "భారత చిప్ పరిశ్రమ వేగంగా పుంజుకుంటోంది. త్వరలోనే 'భారత్ చిప్స్ ప్రపంచానికి వెళ్తాయి' అన్నది వాస్తవరూపం దాల్చనుంది" అని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఒక ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భారత్‌కు సావరిన్ రేటింగ్ అప్‌గ్రేడ్ ఇవ్వడం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. 

భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సులో ఏకాభిప్రాయంతో న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడం కూడా అంతర్జాతీయంగా మన దేశానికి ఉన్న ఆమోదాన్ని స్పష్టం చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 'సెమీకాన్ 2.0' కార్యక్రమం ద్వారా దేశంలో సెమీకండక్టర్ల పర్యావరణ వ్యవస్థను ఆరు కీలక స్తంభాలపై నిర్మిస్తున్నామని తెలిపారు. చిప్ డిజైన్, యంత్రాలు-ముడి పదార్థాలు, ఫ్యాబ్‌లు, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, నైపుణ్యాభివృద్ధి ఇందులో భాగమని వివరించారు.

సెమీకండక్టర్ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో 105కు పైగా స్టార్టప్‌లు పాల్గొన్నాయని, వాటిలో 20 స్టార్టప్‌లు వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ ద్వారా రూ.800 కోట్ల నిధులను సమీకరించాయని మంత్రి వెల్లడించారు. సెమీకాన్ 2.0 కింద కనీసం 200 చిప్-డిజైన్ స్టార్టప్‌లు, కంపెనీలకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 

పదేళ్లలో 85,000 మంది డిజైన్ ఇంజనీర్లను తయారు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, కేవలం నాలుగేళ్లలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేశామని ఆయన సగర్వంగా ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400కు పైగా యూనివర్సిటీలకు ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) టూల్స్ అందుబాటులో ఉన్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Advertisement
Narendra Modi
India Economic Growth
Semiconductor Industry India
Semicon India 2026
Ashwini Vaishnaw
Indian Chip Manufacturing

More Telugu News