మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం.. రేపు వారణాసి వెళుతున్న సీఎం చంద్రబాబు

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం.. రేపు వారణాసి వెళుతున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to visit Varanasi for PM Modi 25 years public service celebration
  • ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై వారణాసిలో ప్రత్యేక కార్యక్రమం
  • 'సేవా సంకల్ప్ అభియాన్‌'కు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
  • వారణాసి-వాద్‌నగర్ సేవా యాత్రలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • రేపు ఉదయం వారణాసికి బయలుదేరనున్న చంద్రబాబు
  • పర్యటనలో భాగంగా కాశీ విశ్వనాథుని దర్శించుకోనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (సెప్టెంబరు 17) వారణాసిలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని కాశీలో నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప్ అభియాన్‌' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ అందించిన సేవలకు గుర్తుగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రధాని రాజకీయ జీవితంతో ముడిపడిన వారణాసి, ఆయన స్వస్థలం వాద్‌నగర్‌ను కలుపుతూ 'వారణాసి–వాద్‌నగర్ సేవా యాత్ర'ను చేపట్టారు. యువత, ప్రజాప్రతినిధులు, సేవా సంస్థల భాగస్వామ్యంతో జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని సేవా యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. దేశాభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం, సేవా భావం, సామాజిక బాధ్యత వంటి అంశాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

సీఎం పర్యటన వివరాలు

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం 7:30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 9:35 గంటలకు వారణాసి చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుంటారు. అనంతరం రుద్రాక్ష్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సేవా యాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3:10 గంటలకు వారణాసి నుంచి తిరుగుపయనమై సాయంత్రం 5:15 గంటలకు అమరావతికి చేరుకుంటారు.
Advertisement
Chandrababu Naidu
Narendra Modi
Varanasi
Sewa Sankalp Abhiyan
Varanasi Vadnagar Sewa Yatra
Andhra Pradesh CM

More Telugu News