శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హైటెక్ భద్రత.. తొలిసారిగా సరికొత్త టెక్నాలజీల వినియోగం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హైటెక్ భద్రత.. తొలిసారిగా సరికొత్త టెక్నాలజీల వినియోగం

Tirumala Brahmotsavam high-tech security with first-time use of new technologies
  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
  • కమ్యూనికేషన్ కోసం తొలిసారిగా జియో నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ
  • గ్యాలరీల్లో రద్దీని అంచనా వేసేందుకు 200 ఏఐ ఆధారిత కెమెరాలు
  • 5,300 మంది సిబ్బంది, 3 వేల కెమెరాలతో నిరంతర నిఘా
  • తోపులాటల నివారణకు దిశల వారీగా ప్రత్యేక ఎగ్జిట్ ప్లాన్ అమలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఈసారి భద్రత విషయంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడం, అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూడటం లక్ష్యంగా అధునాతన టెక్నాలజీలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కెమెరాలు, నెట్‌వర్క్ స్లైసింగ్ వంటి టెక్నాలజీలతో భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తోంది.

తొలిసారిగా నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ
గరుడ సేవ వంటి ప్రధాన ఘట్టాల సమయంలో మాడ వీధులకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇంత భారీ రద్దీ ఉన్నప్పుడు సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం, వాకీటాకీల ఫ్రీక్వెన్సీలు ఓవర్‌ల్యాప్ కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

దీనిని అధిగమించేందుకు జియోతో కలిసి ప్రయోగాత్మకంగా ‘నెట్‌వర్క్‌ వితిన్‌ ది నెట్‌వర్క్‌’ పేరుతో నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీని అమలు చేస్తోంది. దీని కింద 30 అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను ఏర్పాటు చేశారు. సాధారణ సిగ్నల్స్ జామ్ అయినా, ఈ పరికరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. 11 కీలక సబ్-కంట్రోల్ పాయింట్ల వద్ద ఉన్నతాధికారులకు వీటిని అందించనున్నారు.

రద్దీని అంచనా వేయనున్న ఏఐ కెమెరాలు
గ్యాలరీల్లో భక్తుల రద్దీని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈసారి తొలిసారిగా ఏఐ, సాఫ్ట్‌వేర్ ఆధారిత హెడ్ కౌంటింగ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 200 కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్యాలరీలను గ్రిడ్లుగా విభజించి, ప్రతి గ్రిడ్‌లో ఉన్న భక్తుల సంఖ్యను ఈ కెమెరాలు రియల్ టైంలో లెక్కిస్తాయి. ఏదైనా గ్యాలరీ సామర్థ్యానికి మించి నిండిపోతే, వెంటనే అప్రమత్తమై భక్తులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు ఇది దోహదపడుతుంది.

తోపులాటల నివారణకు కొత్త ఎగ్జిట్ ప్లాన్
గ్యాలరీల నుంచి భక్తులు ఒకేసారి బయటకు వచ్చే సమయంలో తోపులాటలు జరగకుండా ఈసారి దిశల వారీగా కొత్త ఎగ్జిట్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ఏ మాడ వీధిలో ఉన్న భక్తులు అదే దిశలో బయటకు వెళ్లేలా మార్గాలను నిర్దేశించారు. దక్షిణ మాడ వీధిలోని భక్తుల కోసం ఎస్-3 గేట్ వద్ద ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వారు నేరుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి లేదా తిరుమల బస్టాండ్‌కు చేరుకోవచ్చు.

మొత్తం మీద సుమారు 3,000 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అలిపిరి టోల్‌గేట్, నడక మార్గాల వద్ద ఫేషియల్ రికగ్నిషన్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చారు. విజిలెన్స్, పోలీసు సిబ్బంది కలిపి 5,300 మందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుమలలో 4,600 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉండటంతో ఆ పరిమితి దాటితే తిరుపతిలోని ఏడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లిస్తారు.
Advertisement
Tirumala Brahmotsavam
TTD high tech security
AI crowd control cameras
Jio network slicing technology
Tirumala Garuda Seva security
Tirupati facial recognition surveillance

More Telugu News