బ్రిక్స్ వేదికగా ఐరాస చీఫ్ శాంతి మంత్రం

బ్రిక్స్ వేదికగా ఐరాస చీఫ్ శాంతి మంత్రం

UN Chief Peace Mantra at BRICS Summit
  • ప్రపంచానికి శాంతి అత్యవసరమని బ్రిక్స్ సదస్సులో గుటెర్రస్ పిలుపు
  • గాజా, ఉక్రెయిన్, సూడాన్ సంక్షోభాలపై తీవ్ర ఆందోళన 
  • సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని దేశాలకు హితవు
  • గాజా, సూడాన్‌పై స్పందించిన బ్రిక్స్
  • ఉక్రెయిన్ యుద్ధంపై ప్రస్తావన ఎగ్గొట్టిన కూటమి
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర ఘర్షణలతో సతమతమవుతున్న వేళ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ప్రపంచ శాంతికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గాజా నుంచి మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్, సూడాన్ వరకు ప్రపంచానికి శాంతి అత్యవసరమని నొక్కి చెప్పారు. సమ్మిళిత ప్రపంచ వృద్ధికి శాంతి పునాది అని, అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ సదస్సులో ప్రత్యర్థి దేశాలైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వంటి మధ్యప్రాచ్య నేతలు ఒకే వేదికపై ఉండటం గమనార్హం. వీరితో పాటు ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి ఆహార, ఎరువుల సంక్షోభానికి కారణమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ నేతలందరినీ ఉద్దేశించి గుటెర్రస్ మాట్లాడుతూ.. "ప్రతి దేశం ఐరాస చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు లోబడి తమ బాధ్యతలను గౌరవించాలి. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యం వంటి సూత్రాలను పాటించాలి. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంతో పాటు, అంతర్జాతీయ మానవతా, మానవ హక్కుల చట్టాలకు కట్టుబడి ఉండాలి" అని హితవు పలికారు.

గుటెర్రస్ శాంతి పిలుపునకు బ్రిక్స్ కూటమి సానుకూలంగా స్పందించింది. శనివారం ఆమోదించిన ఉమ్మడి ప్రకటనలో ప‌శ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్ల హక్కులను కాపాడాలని కోరింది. అలాగే సూడాన్‌లో క్షీణిస్తున్న పరిస్థితి, మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా నేతలు ఈ ప్రకటనపై సంతకాలు చేయడం దౌత్యపరమైన ముందడుగుగా భావిస్తున్నారు.

అయితే, గాజా, సూడాన్‌పై స్పందించిన బ్రిక్స్ కూటమి.. ఉక్రెయిన్ యుద్ధంపై మాత్రం తమ ఉమ్మడి ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. గత ఏడాది బ్రెజిల్‌లో జరిగిన సదస్సులో కనీసం దీనిపై ప్రస్తావించిన కూటమి, ఈసారి పూర్తిగా మౌనం పాటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Advertisement
Antonio Guterres
BRICS Summit
Global Peace
United Nations
Gaza Ceasefire
Vladimir Putin

More Telugu News