డ్రోన్లతో వైద్యం, వ్యర్థాలతో సంపద.. ఏపీ కలెక్టర్ల బెస్ట్ ఐడియాలు!

డ్రోన్లతో వైద్యం, వ్యర్థాలతో సంపద.. ఏపీ కలెక్టర్ల బెస్ట్ ఐడియాలు!

Medicine with drones wealth from waste Best ideas of AP Collectors
  • 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉత్తమ పాలనా విధానాలపై ప్రజెంటేషన్లు
  • అల్లూరి జిల్లాలో డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు
  • చిత్తూరులో డిజిటల్ విద్య, బాపట్లలో ఆటిజం విద్యార్థులకు ప్రత్యేక స్కూల్
  • వ్యర్థాలతో సంపద, భూసారం పెంపుపై ప్రకాశం, సత్యసాయి జిల్లాల ప్రాజెక్టులు
  • క్రీడలు, వ్యవసాయంలోనూ అనంతపురం, కర్నూలు జిల్లాల నూతన ఆవిష్కరణలు
రాష్ట్రంలో నిర్వహించిన 8వ కలెక్టర్ల సదస్సులో ఏడుగురు జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పాలనా విధానాలను (బెస్ట్ ప్రాక్టీసెస్) ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో తాము చేపట్టిన వినూత్న కార్యక్రమాలను, వాటి ద్వారా సాధించిన సత్ఫలితాలను ఈ సదస్సులో వారు పంచుకున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 'ప్రాజెక్ట్ డ్రోన్' పేరుతో మారుమూల గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర ఔషధాలు, రక్త నమూనాలను సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంతి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 20 వేల మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. అనంతపురం జిల్లాలో 'స్కూల్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్' ద్వారా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు.

బాపట్ల జిల్లాలో 'స్వర్ణ భవిత' పేరుతో ఆటిజం బాధితులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విద్య, వైద్యం, థెరపీ సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో 'ODiSi-డిజిటల్ స్కూల్ లెర్నింగ్' కార్యక్రమం కింద 22 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు.

'ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్' పద్ధతిలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి వివరించారు. ఈ విధానంలో జిల్లాలో ఇప్పటికే 1.94 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో 'వేస్ట్ టూ వెల్త్' ప్రాజెక్టు ద్వారా వ్యర్థాల నుంచి 'గ్రీన్ గోల్డ్' బ్రాండ్‌తో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సత్యసాయి జిల్లాలో 'పునర్జీవం' ప్రాజెక్టు కింద బయోచార్‌తో భూసారాన్ని పెంచుతున్నామని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుతున్నామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వివరించారు.
Advertisement
Andhra Pradesh District Collectors
AP Collectors Conference
Project Drone Alluri District
Waste to Wealth Prakasam

More Telugu News