ప్రతి వారం ప్రజల మధ్యనే ఉంటా: సీఎం చంద్రబాబు

ప్రతి వారం ప్రజల మధ్యనే ఉంటా: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says he will be among the people every week for governance
  • కోనసీమ జిల్లాలో ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామసభ
  • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు
  • గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
  • 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించినట్టు వెల్లడి
  • భూమికి పూర్తి భద్రత కల్పించేలా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు
  • రూ.240 కోట్లతో ఈపీడీసీఎల్ గ్రిడ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికి పరిమితమై పనిచేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని, దానికోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని మాచడవ పండువారిపేటలో బుధవారం నిర్వహించిన ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి వారం ప్రజల వద్దకే వస్తున్నానని, వారి బాగోగులు తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నానని తెలిపారు.

ప్రతినెలా ఒకటో తేదీన పేదల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నానని సీఎం గుర్తుచేశారు. అలాగే, ప్రతి నెలా మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో, నాలుగో శనివారం పీ4 (ప్రజలు, ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం) కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టి జరుగుతుందని, తద్వారా ప్రజలంతా గౌరవంగా జీవించేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

భూమికి భద్రత.. గత ప్రభుత్వ పాపాల ప్రక్షాళన
ప్రతి నెలా 9వ తేదీన ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రైతులకు, యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని సీఎం తెలిపారు. భూమిపై యజమానులకు తిరుగులేని హక్కులు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత పాలకులు తమ ఐదేళ్ల పాలనలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని, రికార్డులను తారుమారు చేసి ఘోరాలు, నేరాలు, పాపాలు చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను కాజేసేందుకు కుట్ర పన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రమాదకర చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు భరోసా ఇచ్చిందని గుర్తుచేశారు.

“రీసర్వే పేరుతో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములపై కూడా తమ ఫొటోలు వేసుకున్నారు. సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకునే పిచ్చి ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. తమకు ఇష్టం లేని వ్యక్తుల భూములను, ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అందుకే ఇప్పుడు పటిష్ఠమైన రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి, ఎక్కడా అవకతవకలకు తావులేకుండా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఈ-కేవైసీ, క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నాం”అని చంద్రబాబు వివరించారు.

రికార్డు స్థాయిలో రెవెన్యూ సంస్కరణలు
భూమికి సంపూర్ణ భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ అజెండా అని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,234 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి, 36 లక్షల మందికి రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 8,582 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి మొత్తం 56 లక్షల పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటో మ్యూటేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, వారసత్వ భూముల విభజనలో స్టాంప్ డ్యూటీని కేవలం రూ.1000కి పరిమితం చేయడం ద్వారా 1.25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చామని చెప్పారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి లక్షలాది మందికి ఊరట కల్పించామని అన్నారు. శెట్టిపల్లి కంగుంది, వట్టిచెరుకూరు, ముదినేపల్లి వంటి ప్రాంతాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న 244 కీలక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారు. 

అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురంలో బ్రిటిష్ కాలం నాటి (1908) 22ఏ(1) నిషేధిత భూముల సమస్యను కూడా పరిష్కరిస్తున్నామని, దీని ద్వారా 1410 మందికి చెందిన 56.37 ఎకరాల భూమికి విముక్తి కల్పిస్తున్నామని ప్రకటించారు. "గొడ్డలి పార్టీ తారుమారు చేసిన రికార్డులను ప్రక్షాళన చేసి భూ సమస్యలను కొలిక్కి తెస్తున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
భూమి భద్రతతో పాటు నీటి భద్రతకు కూడా తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం అన్నారు. ఈ ఏడాది తీవ్రమైన ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ కక్షతో కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లే పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయి ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఢిల్లీలో సంజీవనిలా పనిచేసిందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) రూ.240 కోట్ల వ్యయంతో చేపట్టిన గ్రిడ్ ఆధునీకరణ, 3-ఫేజ్ విద్యుత్ సరఫరా పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీశ్, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Chandrababu Naidu
Mee Bhoomi Mee Hakku
Andhra Pradesh Revenue Reforms
Pattadar Passbooks
P Gannavaram Grama Sabha
Land Titling Act Repeal

More Telugu News