ఝార్ఖండ్ ఓటర్ల జాబితాలో ముగ్గురు ఆఫ్ఘన్ జాతీయుల పేర్లు.. ఈసీ విచారణ
- ఝార్ఖండ్ 'సర్' ప్రక్రియలో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి
- ముసాయిదా జాబితా పరిశీలనలో వ్యత్యాసాన్ని కనిపెట్టిన అధికారులు
- ముగ్గురి పేర్లను జాబితా నుంచి తొలగించిన అధికారులు
ఝార్ఖండ్లో నిర్వహించిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో తీవ్ర దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. జమ్షెడ్పూర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఏకంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ పౌరుల పేర్లు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, పత్రాల ధృవీకరణ సమయంలో అధికారులు ఈ వ్యత్యాసాన్ని కనిపెట్టారు. నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు సరైన భారతీయ పౌరసత్వ పత్రాలను సమర్పించలేకపోయారు. అనంతరం నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద ఆఫ్ఘనిస్థాన్ పాస్పోర్టులు లభించడంతో వారు విదేశీయులని నిర్ధారణ అయింది.
ఝార్ఖండ్ సీఈవో కేజీ రవికుమార్ ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ, విదేశీ పౌరుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తక్షణమే తొలగించినట్లు వెల్లడించారు. విదేశీ పౌరులకు భారతీయ ఓటరు కార్డులు లభించేలా వెనుకుండి సహకరించిన వ్యక్తులు, అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యుల పత్రాలపై కూడా తనిఖీలు జరుపుతున్నామని... రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి విదేశీయుల పేర్లు నమోదయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.