బాధలు చెప్పుకొని పాక్‌ వలలో పడుతున్న భారత అధికారులు.. హనీ ట్రాప్ కోసం ఐఎస్‌ఐ కొత్త వ్యూహాలు!

బాధలు చెప్పుకొని పాక్‌ వలలో పడుతున్న భారత అధికారులు.. హనీ ట్రాప్ కోసం ఐఎస్‌ఐ కొత్త వ్యూహాలు!

ISI honey trap strategies targeting Indian officials through personal grievances
  • భారత్‌లో పెరుగుతున్న హనీ ట్రాప్‌ కేసులు
  • సైకాలజిస్టులను రంగంలోకి దింపుతున్న ఐఎస్‌ఐ
  • సోషల్‌ మీడియా ద్వారానే లక్ష్యిత వ్యక్తుల గుర్తింపు
  • నెలలపాటు వ్యక్తిగత బలహీనతల అధ్యయనం
  • నమ్మకం వచ్చాక మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌
భారత్‌లో హనీ ట్రాప్‌ ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. కొందరు కీలక సమాచారాన్ని కలిగి ఉన్న వ్యక్తులు ఈ వలలో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌ల వెనుక పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అనుసరిస్తున్న కొత్త వ్యూహం భారత భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. డబ్బు ఆశ చూపడం, బెదిరించడం కంటే.. లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తుల వ్యక్తిగత సమస్యలను గుర్తించి వాటినే ఆయుధంగా మార్చుకుంటున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఈ వ్యూహం కోసం ఐఎస్‌ఐ పెద్ద సంఖ్యలో సైకాలజిస్టులను రంగంలోకి దింపినట్లు ఓ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి వెల్లడించారు. సున్నితమైన సమాచారానికి యాక్సెస్‌ ఉన్న అధికారులను సోషల్‌ మీడియా ద్వారా గుర్తించడం వీరి పని. ఇందుకోసం మహిళల పేర్లు, ఫొటోలతో నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టిస్తున్నట్లు సమాచారం.

ముందుగా లక్ష్యంగా ఎంచుకున్న అధికారుల సోషల్‌ మీడియా పోస్టులను వీరు నిశితంగా పరిశీలిస్తారు. వారి ఆలోచనా విధానం, వ్యక్తిగత సమస్యలు, అసంతృప్తి, బలహీనతలను అంచనా వేస్తారు. ఆ తర్వాత మహిళా గుర్తింపుతో వారితో పరిచయం పెంచుకుంటారు. బాధలు, వ్యక్తిగత సమస్యల విషయంలో సానుభూతి చూపిస్తూ నెమ్మదిగా నమ్మకాన్ని సంపాదిస్తారు.

ఈ ప్రక్రియ ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు సంబంధాన్ని కొనసాగిస్తూ వ్యక్తి బలహీనతలను గుర్తిస్తారని అధికారులు చెబుతున్నారు. నమ్మకం ఏర్పడిన తర్వాత వారి కంప్యూటర్‌ లేదా ఇతర పరికరాల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్‌స్టాల్‌ చేసుకునేలా ప్రేరేపిస్తారు. వీటిలో కొన్ని స్పైవేర్‌, మాల్‌వేర్‌ ఉండి డేటాను బయటకు పంపే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వీటిలో చైనా మూలాలున్న సాఫ్ట్‌వేర్‌ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం.

డబ్బు ఆశ చూపడం, బెదిరింపులకు పాల్పడటం వంటి పాత పద్ధతుల కంటే వ్యక్తిగత బలహీనతలను ఉపయోగించుకోవడం ఇప్పుడు ప్రభావవంతంగా మారిందని అధికారులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో తమ అసంతృప్తిని, వ్యక్తిగత సమస్యలను బహిరంగంగా పంచుకునే వారిని సైకాలజిస్టులు సులభంగా గుర్తిస్తున్నారని తెలిపారు.

ఇలా బాధితుడు అసలు తాను హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాననే విషయాన్ని గుర్తించేలోపే.. డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ద్వారా సున్నితమైన సమాచారాన్ని పంచుకునే పరిస్థితికి చేరుకుంటున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌ల్లో సైకాలజిస్టుల నియామకాలు పెరుగుతున్నట్లు వస్తున్న సమాచారం భారత భద్రతా సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
ISI
Honey Trap
Indian Officials
Pakistan Intelligence Agency
Social Media Espionage
Cyber Security India

More Telugu News