ఇది నాకో, సునీతమ్మకో జరిగిన అవమానం కాదు: సబితా ఇంద్రారెడ్డి
- మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారన్న సబిత
- కేటీఆర్ అడ్డుకోకపోయి ఉంటే అక్కడే పడేసి తొక్కేసే వారని ఆవేదన
- హక్కుల కోసం ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపాటు
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై అభ్యంతరకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కేవలం తమకు జరిగిన పరాభవం కాదని, మొత్తం తెలంగాణ మహిళా సమాజానికి జరిగిన తీవ్ర అవమానమని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ 1,000 రోజుల విఫల పాలనను నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి తరలివచ్చిన తమను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని, మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళుతూ, చీరలు లాగుతూ విచక్షణారహితంగా ప్రవర్తించారని ఆరోపించారు.
"సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని పోలీసులు లాగుతుంటే, కేటీఆర్ సమయానికి వచ్చి అడ్డుకోకపోయి ఉంటే మమ్మల్ని అక్కడే పడేసి తొక్కేసేవారు.. కేటీఆర్ రావడంతోనే మేము ప్రాణాలతో బయటపడ్డాం" అని సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే గొంతు నొక్కడం, బట్టలు లాగడం, దాడికి దిగడం ఏ రకమైన ప్రజాపాలన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం... నేడు ప్రజాప్రతినిధులైన మహిళలకే రక్షణ లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తూ, అక్రమ అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.