మహిళా ఎమ్మెల్యే చీర లాగిన వాళ్లను వదిలిపెట్టం: హరీశ్ రావు
- బీఆర్ఎస్ సభ్యులు సభలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్రతో రేవంత్ ప్రభుత్వం ఉందన్న హరీశ్ రావు
- శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని వ్యాఖ్య
- శాసనసభ కౌరవసభలా మారిందని విమర్శ
తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ తమ పార్టీ ప్రజాప్రతినిధులపై పోలీసులు అత్యంత దురుసుగా వ్యవహరించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులు ఎవరూ సభలోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవాలనే కుట్రతోనే రేవంత్ ప్రభుత్వం ఈ రకమైన అణచివేత చర్యలకు ఒడిగట్టిందని మండిపడ్డారు. ప్రతిపక్షం లేని సభను నడిపించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తిన ఆయన... అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నిరసన టీషర్టులు ధరించి పార్లమెంట్కు వెళ్లినప్పుడు లేని తప్పు, మేం అసెంబ్లీకి నల్ల టీషర్టులతో వస్తే తప్పవుతుందా? నల్ల టీషర్టులపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం నేరమా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా?" అని హరీశ్రావు నిలదీశారు. తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని, ఇది అసలైన శాసనసభలా కాకుండా కౌరవసభలా మారిందని తీవ్రస్థాయిలో అభివర్ణించారు.
మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి, సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కిన పోలీస్ అధికారులను, అలాగే మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని కిందపడేసి హింసించిన ఖాకీలను సప్తసముద్రాల అవతల ఉన్నా వదిలేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఆందోళనలో కేటీఆర్ చేయి, ముఖంపై గాయాలయ్యాయని, కనీసం ఆసుపత్రికి కూడా తరలించకుండా అడ్డుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై జరిగిన ఈ దాడులు, అక్రమ అరెస్టులన్నింటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హరీశ్రావు స్పష్టం చేశారు.