నేను స్పీకర్ను, చైర్మన్ను దూషించలేదు.. నా మాటలను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది: ఎమ్మెల్సీ తాతా మధు
- అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు
- స్పీకర్ స్థానంపై తనకు అపారమైన గౌరవం ఉందని వ్యాఖ్య
- తన గొంతు నొక్కేందుకు యత్నించిన పోలీసు అధికారులపై మాత్రమే తాను ఆగ్రహం వ్యక్తం చేశానన్న మధు
అసెంబ్లీ స్పీకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మధు చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో తాతా మధు మాట్లాడుతూ... శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, స్పీకర్ స్థానమంటే తనకు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో తనపై కాంగ్రెస్ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల, ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, తన ప్యాంటు లాగి గొంతు నొక్కేందుకు యత్నించిన పోలీసు అధికారులపై మాత్రమే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, తీవ్ర అసహనంతో అన్న మాటలను స్పీకర్కు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో తనపై కాంగ్రెస్ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల, ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, తన ప్యాంటు లాగి గొంతు నొక్కేందుకు యత్నించిన పోలీసు అధికారులపై మాత్రమే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, తీవ్ర అసహనంతో అన్న మాటలను స్పీకర్కు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం, చేతకానితనంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి తప్పుడు ఆరోపణలకు తెరతీసిందని తాతా మధు విమర్శించారు. "పోలీసుల అక్రమాలను ప్రశ్నిస్తే.. దాన్ని స్పీకర్ను అవమానించినట్లు చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల డిమాండ్లకు భయపడేది లేదు" అని తేల్చిచెప్పారు. అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ ఆరోపణలు, సవాల్లతో అసెంబ్లీ ప్రాంగణంలో పొలిటికల్ హీట్ మరింత రగిలింది.