అమరావతిపై నాకు అభ్యంతరం లేదు.. మా పార్టీ సీఎం అభ్యర్థి నేను కాదు: విజయసాయిరెడ్డి

అమరావతిపై నాకు అభ్యంతరం లేదు.. మా పార్టీ సీఎం అభ్యర్థి నేను కాదు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy has no objection to Amaravati and is not CM candidate for his new party
  • ఇష్టమున్నా లేకున్నా అమరావతిని రాజధానిగా అంగీకరించాల్సిందేనన్న విజయసాయి
  • రెడ్డి, కమ్మ సామాజికవర్గాల వారే సీఎంలుగా ఉండాలా అని ప్రశ్న
  • తమ పార్టీలో 66 శాతం ప్రాధాన్యత యువతకే ఇస్తానని వెల్లడి

"అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మనకు ఇష్టమున్నా లేకున్నా అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరించి తీరాల్సిందే" అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆయన... భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 


రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని.. ఏపీని రూ. 12 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే తమ కొత్త పార్టీ ఉద్భవిస్తోందని స్పష్టం చేశారు. కేవలం రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల వారే సీఎం స్థానంలో ఉండాలా? ఆయన ప్రశ్నించారు. బీసీలతో సహా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని... తమ పార్టీలో ఏకంగా 66 శాతం ప్రాధాన్యత యువతకే ఇస్తామని హామీ ఇచ్చారు.


ఇదే సమయంలో ఆయన మరొక సంచలన ప్రకటన చేశారు. తన పార్టీకి తాను సీఎం అభ్యర్థిని కాదని స్పష్టం చేశారు. బాల్ థాకరే తరహాలో కేవలం 'మెంటర్' గా మాత్రమే దిశానిర్దేశం చేస్తానని తేల్చిచెప్పారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా పదవుల్లో ఉండరని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ. 1.02 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు, గత 12 ఏళ్ల పాలనలో రూ. 12 లక్షల కోట్లకు ఎలా చేరాయని... ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలను అదుపులోకి తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన ధ్యేయమని వెల్లడించారు.

Advertisement
Vijayasai Reddy
Andhra Pradesh New Party
Amaravati Capital
AP State Debt
BC CM Candidate
Youth Politics AP

More Telugu News