కాంగ్రెస్ మాట విని తప్పుడు కేసులు పెడితే వదిలే ప్రసక్తే లేదు.. వడ్డీతో సహా చెల్లిస్తాం: పోలీసులకు పువ్వాడ వార్నింగ్
- బీఆర్ఎస్ పాలనలో పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వహించారన్న పువ్వాడ
- కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల జాబితా తమ వద్ద ఉందని వెల్లడి
- బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
అధికార కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ పోలీసు యంత్రాంగాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’తో పారదర్శకంగా విధులు నిర్వహించిన వ్యవస్థను, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం హింసను ప్రోత్సహించేలా వాడుకుంటోందని తీవ్రంగా ధ్వజమెత్తారు.
తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన పువ్వాడ... అధికార పార్టీ నేతల సైగలకు అనుగుణంగా తప్పుడు పనులు చేస్తున్న పోలీసు అధికారుల జాబితా తమ దగ్గర సిద్ధంగా ఉందన్నారు. చట్టాన్ని పక్కనపెట్టి బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తున్న ప్రతీ ఒక్కరికీ భవిష్యత్తులో వడ్డీతో సహా చెల్లిస్తామని ఘాటుగా హెచ్చరించారు. పోలీసులు ఇకనైనా ఏకపక్ష వైఖరిని విడనాడి, నిష్పాక్షికంగా చట్టపరిధిలో పనిచేయాలని సూచించారు.