డీజీపీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత
- కవితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్
- కేవలం సస్పెండ్ చేసి సరిపెట్టారని కవిత మండిపాటు
- కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పరువు తీస్తానని హెచ్చరిక
తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ను కేవలం సస్పెండ్ చేసి సరిపెట్టారంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను దూషిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడే చట్టాలు ఉన్నప్పటికీ పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, సదరు కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రభుత్వ పరువు తీస్తానని హెచ్చరించారు.
బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, "డీజీపీ గారికి ఇద్దరు కోడళ్లు ఉన్నారు. వారిపై ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా? నాలాంటి ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ డీజీపీ బాధ్యతలు స్వీకరించాకే క్రైమ్ రేటు పెరిగిందని, గంజాయి విక్రయాలపై సిగ్గుచేటు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్న రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాలనలో వారిని పూర్తిగా విస్మరించారని కవిత ధ్వజమెత్తారు. ఉద్యమకారుల్లో ఉన్న నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని, ఇక మిగిలింది ఆమరణ దీక్ష మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యమకారుల సంక్షేమంపై స్పష్టమైన గడువుతో కూడిన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తప్పుడు లెక్కలు చూపిన కాంగ్రెస్, ఇప్పుడు బీసీల కోసం ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.