ఓటర్లకు డబ్బు పంచకుండా నా సవాల్ స్వీకరిస్తావా?: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
- తాడిపత్రిలో మరోసారి వేడెక్కిన రాజకీయం
- వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పెద్దారెడ్డికి జేసీ సవాల్
- చెరో రూ. 10 కోట్లు తాడిపత్రి అభివృద్ధికి ఖర్చు చేద్దామని ప్రతిపాదన
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్యంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని హెచ్చరించిన ఆయన... గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తాడిపత్రిలో మట్కా, బెట్టింగ్, గంజాయి దందాలు విచ్చలవిడిగా సాగాయని ఆరోపించారు. బీఎస్-3 వాహనాల కుంభకోణంతో పాటు అక్రమ సంపాదనకు అలవాటు పడి తాడిపత్రి ప్రాంత అభివృద్ధిని కేతిరెడ్డి పూర్తిగా నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ విమర్శలతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఆసక్తికరమైన సవాల్ను కేతిరెడ్డి ముందుంచారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు పైసలు పంచే సంస్కృతికి స్వస్తి పలికి, ఇద్దరం చెరో రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 20 కోట్లు తీసి తాడిపత్రి పట్టణాభివృద్ధికి ఖర్చు చేద్దామని ప్రతిపాదించారు. "నా సవాల్ను స్వీకరించే ధైర్యం, తాడిపత్రిపై నిజమైన ప్రేమ నీకు ఉందా పెద్దారెడ్డి?" అని సూటిగా ప్రశ్నించారు.