విద్యార్థుల తీరుపై చంద్రబాబు ఆవేదన.. వివేకంతో వ్యవహరించాలంటూ టీచర్లకు సూచన

Chandrababu Naidu expresses concern over student behavior and advises teachers to act wisely
  • నేటి సున్నిత పరిస్థితుల్లో బోధన టీచర్లకు పెను సవాల్ అని సీఎం చంద్రబాబు అన్నారు
  • గతంలో దండించేవారని, ఇప్పుడు మందలించినా ఇబ్బందులేనని వ్యాఖ్యానించారు
  • విద్యార్థుల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తి, మానసిక బలహీనతలపై ఆవేదన వ్యక్తం చేశారు
  • ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిటీ, రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది
  • ఏఐ వంటి టెక్నాలజీ వచ్చినా గురువుల స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు
గతంలో దండనతో అయినా విద్యార్థులకు పాఠాలు నేర్పించే వీలుండేదని, కానీ నేటి సున్నితమైన పరిస్థితుల్లో కనీసం వారిని మందలించినా ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విద్యాబోధన అత్యంత సవాళ్లతో కూడుకున్న అంశంగా మారిపోయిందని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన వాతావరణంలో ఉపాధ్యాయులు ఎంతో వివేకంతో ఆలోచించి వ్యవహారాలను చక్కబెట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మారుతున్న సామాజిక పరిస్థితులు, విద్యార్థుల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సామాజిక మాధ్యమాల ప్రభావంతో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని, మానసిక బలహీనతతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు ప్రిన్సిపల్‌ను హత్య చేయడం, విజయనగరంలో ఓ బాలుడు కన్నతల్లినే చంపడం, విశాఖలో టీచర్ కొట్టిన దెబ్బకు ఆరేళ్ల చిన్నారి షాక్‌తో ప్రాణాలు విడవడం వంటి ఘటనలు తనను కలచివేశాయని తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని, ఈ పరిస్థితులను అధిగమించేందుకు విద్యార్థులకు యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన వంటివి అలవాటు చేయాలని సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా ఉపాధ్యాయుల స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. టీచర్ వద్ద లేని సమాధానం ఏఐ కూడా చెప్పలేదని అన్నారు. విద్యార్థులను భవిష్యత్ ప్రపంచానికి సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని, వారిని కేవలం పాఠాలకే పరిమితం చేయకుండా విలువలు, సంస్కృతి, దేశభక్తి, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించాలని కోరారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని, దేశానికే "ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్" ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

2027 నాటికి రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేసిందని, వైసీపీ నేతలు 350కి పైగా పిటిషన్లు వేసి అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి నియామకాలు చేపట్టామని గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ, వారి ప్రతిభకే పెద్దపీట వేసేలా పారదర్శక కౌన్సెలింగ్ విధానాన్ని చట్టబద్ధం చేశామని వివరించారు.

గత ప్రభుత్వంలా కాకుండా, తాము ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సముచిత గౌరవం ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలో అగ్రగామిగా నిలిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉండాలని, ఆ లక్ష్యానికి పునాదులు వేయాల్సింది ఉపాధ్యాయులేనని చంద్రబాబు పిలుపునిచ్చారు.


Advertisement
Chandrababu Naidu
Teachers Day celebrations
Andhra Pradesh education
Mega DSC recruitment
Student behavior
AP Model of Education

More Telugu News