Advertisement

ఒకే వేదిక‌పై భార‌త్‌, పాకిస్థాన్ ప్ర‌ధానులు

Narendra Modi and Shehbaz Sharif share stage at SCO Summit in Bishkek
  • బిష్కెక్‌లో 26వ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
  • ఇతర దేశాధినేతలతో కలిసి గ్రూప్ ఫొటోలో పాలుపంచుకున్న ప్రధాని
  • ఈ సంద‌ర్భంగా పాక్ ప్ర‌ధానితో క‌లిసి ఒకే వేదిక‌పై క‌నిపించిన మోదీ
  • కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు
  • ఉగ్రవాద రహిత ప్రాంతం కోసం కృషి చేయాలని ఎస్‌సీఓ సభ్యులకు పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ, కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ కూటమి కీలక చర్చల్లో భాగంగా ఇతర దేశాధినేతలతో కలిసి ఆయన గ్రూప్ ఫొటోగ్రాఫ్‌లో పాల్గొన్నారు. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌, ర‌ష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌, ఇరాన్ అధ్య‌క్షుడు పెజెష్కియాన్‌, పాకిస్థాన్ ప్ర‌ధాని షెహబాజ్ షరీఫ్, ఇత‌ర దేశాల నేత‌ల‌తో క‌లిసి ఒకే వేదిక‌పై ఫొటోల‌కు పోజిచ్చారు. 

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు సాదిర్ జపరోవ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్-కిర్గిజ్‌స్థాన్ మధ్య సంబంధాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ చర్చల ద్వారా పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారానికి మరింత ఊపు లభిస్తుందని భావిస్తున్నారు.

అంతకుముందు ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు బిష్కెక్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. 'భారత్ మాతా కీ జై', 'వందే మాతరం' నినాదాలతో వారు హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రవాసులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, యోగా ప్రదర్శనలను మోదీ తిలకించి వారిని అభినందించారు. "భారత్ నుంచి బిష్కెక్‌కు.. ఈ సాయంత్రం భారత సమాజం నుంచి చాలా ప్రత్యేకమైన స్వాగతం లభించింది" అని ప్రధాని మోదీ 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు.

బిష్కెక్‌లోని మానస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిర్గిజ్ రిపబ్లిక్ క్యాబినెట్ మంత్రుల ఛైర్మన్ ఆదిల్‌బెక్ కాసిమలియేవ్ ప్రధానికి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో పలువురు నేతలతో ద్వైపాక్షికంగా సమావేశమవుతానని మోదీ తెలిపారు.

2017 నుంచి భారత్ ఎస్‌సీఓలో చురుకైన, నిర్మాణాత్మక సభ్య దేశంగా ఉందని తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని గుర్తుచేశారు. "భద్రత, కనెక్టివిటీ, అవకాశాలు" అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ ప్రాంతానికి సంబంధించిన భారత దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం ఎస్‌సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. మధ్య ఆసియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే భారత నిరంతర ప్రయత్నాల్లో ఈ సదస్సులో ప్రధాని భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ఘట్టం.
Advertisement
Narendra Modi
SCO Summit Bishkek
Shehbaz Sharif
India Kyrgyzstan relations
Vladimir Putin
Xi Jinping

More Telugu News