వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయి: నారాయణ
- నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామన్న నారాయణ
- ఓటమి భయంతోనే వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఎద్దేవా
- అభ్యర్థులు కూడా లేని దయనీయ పరిస్థితుల్లో వైసీపీ ఉందని వ్యాఖ్య
వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టుల్లో కేసులు వేసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూ. 3,300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని చూసి తట్టుకోలేక ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని దయనీయ స్థితిలో ఆ పార్టీ ఉందన్న ఆయన... అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదని జగన్ తన నేతలకు హుకుం జారీ చేశారని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టుల క్రెడిట్ తమదేనని వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తోందని వివరించారు. నెల్లూరు నగరంలో కాలువల కట్టలపై ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు మంజూరు చేసే అంశంపై త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని హామీ ఇచ్చారు.