Advertisement

వెలిగొండ ప్రాజెక్టు వద్ద కృష్ణా నీళ్లను నెత్తిన చల్లుకుని, బాటిళ్లతో పట్టుకెళ్లిన జనం

People sprinkle Krishna water on heads and carry bottles at Veligonda Project
  • దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం
  • నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • నీళ్లను నెత్తిన చల్లుకుని, బాటిళ్లలో నింపుకెళ్లిన ప్రజలు
  • ప్రాజెక్టు ప్రారంభంతో మార్కాపురం జిల్లాలో వెల్లివిరిసిన సంబరాలు
  • కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు చూసి రైతుల ఆనందభాష్పాలు
అది కేవలం నీటి ప్రవాహం కాదు, దశాబ్దాలుగా కరవు నేల చూస్తున్న కల సాకారమైన క్షణం. అందుకే, పరుగులు పెడుతున్న కృష్ణమ్మను చూసి అక్కడికి వచ్చిన జనం కేవలం కేరింతలు కొట్టడమే కాదు, ఆ నీటిని చేతులతో తాకి భక్తితో కళ్లకద్దుకున్నారు. ఎంతో పవిత్రంగా భావిస్తూ తలపై చల్లుకున్నారు. కొందరైతే తాము తెచ్చుకున్న బాటిళ్లలో ఆ పుణ్య జలాలను నింపుకుని ఇళ్లకు పట్టుకెళ్లారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించిన ఈ దృశ్యం, ఆ ప్రాంత ప్రజల గుండెల్లో కృష్ణా జలాలకు ఉన్న స్థానాన్ని, వారి నిరీక్షణ తీవ్రతను చెప్పకనే చెప్పింది.

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించారు. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేయడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా జల సంబరంతో పులకించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల కళ్లముందే ప్రవాహమై పరుగులెడుతుంటే, అక్కడికి తరలివచ్చిన రైతులు, మహిళలు, ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

గేట్లు ఎత్తగానే కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే, ప్రజల ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చాలా మంది తమ సెల్‌ఫోన్లలో ఈ అపురూప దృశ్యాన్ని బంధించారు. తమ ప్రాంతానికి నీళ్లు వస్తాయో రావో అనే సందేహంతో బతికిన తాము, ఇప్పుడు కళ్లారా కృష్ణమ్మ పరవళ్లను చూస్తున్నామంటూ పలువురు రైతులు భావోద్వేగానికి గురయ్యారు. తమ జీవితాల్లో ఇదొక చారిత్రక మలుపు అని, తమ కరవు కష్టాలు తీరినట్టేనని ఆనందబాష్పాలతో తెలిపారు.

సాధారణంగా సభ ముగియగానే జనం ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ ఇక్కడ మాత్రం చాలాసేపటి వరకు ప్రజలు కాల్వ కట్టపైనే ఉండిపోయి, ప్రవహిస్తున్న కృష్ణమ్మను చూస్తూ మురిసిపోయారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, మార్కాపురం జిల్లా ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఒక మధుర జ్ఞాపకంగా, చరిత్రాత్మక ఘట్టంగా మారిపోయింది.
Advertisement
Veligonda Project
Chandrababu Naidu
Krishna River Water
Markapuram District
Nallamala Sagar
Andhra Pradesh Irrigation

More Telugu News