మార్కాపురం టైమ్ స్టార్ట్ అయింది.. చంద్రబాబు వెలిగొండ టూర్ సైడ్ లైట్స్ ఇవిగో!
- వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- పంచెకట్టులో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, హారతి.. సాష్టాంగ నమస్కారం
- రాబోయే తరాల కోసం పనిచేస్తా, ఓట్ల కోసం కాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
- ఇక మార్కాపురం టైం మొదలైందని, ఈ ప్రాంతం అన్స్టాపబుల్ అని వ్యాఖ్య
- ఉద్యమకారుడు పూలసుబ్బయ్య కుటుంబ సభ్యులను సత్కరించిన చంద్రబాబు
ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వాసుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొని, కృష్ణా జలాలను పవిత్రమైన పూజలతో ఆహ్వానించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది.












- ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదాయ పంచెకట్టులో ప్రాజెక్టు వద్దకు చేరుకుని అందరినీ ఆకట్టుకున్నారు.
- కృష్ణా జలాల్లోకి స్వయంగా దిగి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు.
- ఫీడర్ కాలువ వద్ద ఉరకలేస్తున్న కృష్ణమ్మ ప్రవాహాన్ని చూసి భావోద్వేగానికి లోనైన ఆయన, నేలపై సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు.
- అనంతరం స్థానిక రైతులు, నిర్వాసితులతో కలిసి స్విచ్ నొక్కి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ పవిత్ర జలాలను అక్కడున్న నేతలు, అధికారులపై చల్లుతూ చంద్రబాబు తన సంతోషాన్ని పంచుకున్నారు.
- గిరిజన బిడ్డలు తమ సంప్రదాయ నృత్యాలతో కృష్ణమ్మకు స్వాగతం పలికారు.
- సభలో, చంద్రబాబు తన కండువాను గాల్లోకి తిప్పుతూ రైతుల ఆనందంలో భాగమయ్యారు.
- ఈ ప్రాజెక్టు కోసం పరితపించిన దివంగత నేత పూలసుబ్బయ్య కుటుంబ సభ్యులను వేదికపై ఆత్మీయంగా పలకరించి సన్మానించారు. చంద్రబాబు తమను గౌరవించడం పట్ల పూలసుబ్బయ్య కుమార్తెలు సంతోషం వ్యక్తం చేశారు.
- అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. "నేను ఓట్లు ఆశించి కాదు, మార్పు ఆశించి పనిచేస్తాను. నా ఆలోచన నెక్స్ట్ ఎలక్షన్ కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం" అని స్పష్టం చేశారు.
- "ఇప్పుడు మార్కాపురం టైం స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాంతం ఇక అన్స్టాపబుల్. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి" అని పిలుపునిచ్చారు.
- ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను స్వయంగా పిలిచి శిలాఫలకం వద్ద ఫోటోలు దిగారు.
- ముఖ్యంగా, వెలిగొండ పనులను పరుగులు పెట్టించిన నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.











