కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను రేవంత్ రెడ్డే కాపాడుతున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- హరికృష్ణపై కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ రాడ్లతో దాడి చేశారన్న ప్రవీణ్ కుమార్
- సుమంత్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక రేవంత్ హస్తం ఉందని ఆరోపణ
- సీఐ ముత్తు యాదవ్ ను అకారణంగా సస్పెండ్ చేశారని మండిపాటు
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ఆరోపించారు.
జూలై 30వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, చెక్పోస్ట్ సమీపంలోని ఒక డెన్లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తన అనుచరులతో కలిసి బాధితుడు హరికృష్ణపై రాడ్లతో దారుణంగా దాడి చేశారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. జూలై 31న బాధితుడు ఫిర్యాదు చేస్తే, దాదాపు 20 రోజుల పాటు కేసు నమోదు కాకుండా అడ్డుకుని ఆగస్టు 20న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. జూబ్లీహిల్స్లో దాడి జరిగితే సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో కేసు నమోదు కావడం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని వ్యాఖ్యానించారు.
కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసేంత వరకు సుమంత్పై కేసు నమోదు కాకుండా తొక్కిపెట్టారని, కేసు నమోదైనా ఇప్పటి వరకు సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. పైగా కేవలం మూడు వారాల క్రితమే బాధ్యతలు స్వీకరించిన జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను ఈ వ్యవహారంలో బలిపశువును చేస్తూ అకారణంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.