అమెరికా ఉద్యోగం వదిలి.. రూ.700 కోట్ల సేంద్రియ సామ్రాజ్యాన్ని నిర్మించి.. మాజీ టెక్కీ వ్యవసాయ విజయగాథ!

Shashi Kumar Left US Job To Build 700 Crore Organic Empire Agriculture Success Story
  • అమెరికాలో టెక్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయంలోకి అడుగుపెట్టిన శశి కుమార్
  • ఆయన స్థాపించిన 'అక్షయకల్ప ఆర్గానిక్' సంస్థ వార్షిక టర్నోవర్ సుమారు రూ.700 కోట్లు
  • ఒకప్పుడు దివాలా అంచున నిలిస్తే.. భార్య, మామ ఆర్థికంగా ఆదుకున్న వైనం
  • ప్రస్తుతం 2,800 మంది రైతులకు ఉపాధి, నెలకు రూ.1.28 లక్షల సగటు ఆదాయం
  • వ్యవసాయం లాభదాయకమని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం
అధిక జీతంతో అమెరికాలో స్థిరపడాలనేది ఎంతోమంది యువత కల. కానీ, కర్ణాటకకు చెందిన శశి కుమార్ మాత్రం ఆ కలను కాదనుకున్నారు. విప్రో లాంటి దిగ్గజ సంస్థలో పనిచేస్తూ, అమెరికాలో ఆర్కిటెక్ట్‌గా ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన, అన్నీ వదిలేసి 2010లో స్వదేశానికి తిరిగొచ్చారు. వ్యవసాయం చేయడానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం, ఈరోజు రూ.700 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించే 'అక్షయకల్ప ఆర్గానిక్' అనే భారీ సంస్థకు పునాది వేసింది.

కర్ణాటకలోని తిప్తూర్‌లో ఓ రైతు కుటుంబంలో శశి కుమార్ జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయంపై ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ, తన పిల్లలు మాత్రం చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, వ్యవసాయానికి దూరంగా ఉండాలని బలంగా కోరుకున్నారు. తండ్రి ఆశయం మేరకు శశి కుమార్ బెంగళూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఆ తర్వాత చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ పూర్తిచేశారు. దాదాపు 12 ఏళ్ల పాటు విప్రోలో పనిచేసి, ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే, వ్యవసాయాన్ని లాభసాటిగా, యువతకు ఆకర్షణీయంగా మార్చాలన్న లక్ష్యంతో తన టెక్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు.

ఆయన నిర్ణయం కుటుంబంలో పెద్ద తుపాను సృష్టించింది. కుమారుడిపై తీవ్ర అసంతృప్తికి లోనైన తండ్రి, ఏకంగా ఎనిమిది సంవత్సరాల పాటు ఆయనతో మాట్లాడలేదు. మరోవైపు, అక్షయకల్పను ప్రారంభించిన తొలి నాళ్లలో శశి కుమార్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపెనీ చాలాసార్లు దివాలా తీసే అంచుకు వెళ్లిందని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా 2016లో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడంతో వ్యాపారం మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో ఆయన భార్య శిల్ప ముందుకొచ్చి, కుటుంబ పొదుపు మొత్తమైన రూ.30 లక్షలను వ్యాపారంలో పెట్టారు. ఆయన మామ మరో రూ.10 లక్షలు అందించి ఆదుకున్నారు. ఆ పెట్టుబడే అక్షయకల్పను నిలబెట్టింది.

ఆ కష్టాల నుంచి గట్టెక్కిన అక్షయకల్ప, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నేడు ఈ సంస్థ సుమారు 2,800 గ్రామాల్లో 2,800 మంది రైతులతో కూడిన బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించింది. ఈ రైతుల్లో సగటు వయసు కేవలం 32 సంవత్సరాలు కాగా, దాదాపు 1,200 మంది మహిళలు ఉండటం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్పతో పనిచేస్తున్న ఒక్కో రైతు కుటుంబం నెలకు సగటున రూ.1.28 లక్షల ఆదాయం పొందిందని శశి కుమార్ తెలిపారు. అంటే.. ఏటా దాదాపు రూ.480 కోట్లను రైతు కుటుంబాలకే చెల్లిస్తున్నారు.

వ్యక్తిగత త్యాగాలు, కుటుంబ సంబంధాల ఒత్తిడిని తట్టుకుని, వ్యవసాయాన్ని ఒక కార్పొరేట్ సంస్థలా లాభదాయకంగా నడపవచ్చని శశి కుమార్ నిరూపించారు. ఒకప్పుడు దండగ అనుకున్న వ్యవసాయాన్ని నేడు వేలాది కుటుంబాలకు పండగలా మార్చిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
Advertisement
Shashi Kumar
Akshayakalpa Organic
Organic Farming Success Story
Wipro Techie Turned Farmer
Karnataka Agri Entrepreneur
Sustainable Agriculture Business

More Telugu News