అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజ్లాన్ ఎనర్జీ: నారా లోకేశ్

Anantapur means Kia cars fighter jets and Suzlon renewable energy says Nara Lokesh
  • రాయదుర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి పైగా ఉపాధి
  • పునరుత్పాదక ఇంధనంలో ఏపీని నంబర్ వన్‌గా నిలబెట్టడమే లక్ష్యం
  • సుజ్లాన్ భాగస్వామ్యంతో 12 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
  • రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు
పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని, సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టులు ఈ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం, కణేకల్లు మండలం హులికెర వద్ద సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. సుజ్లాన్‌తో ఏపీకి ఉన్న రెండు దశాబ్దాల బంధం పునరుద్ధరణ కావడం సంతోషంగా ఉందన్నారు.

స్వచ్ఛ ఇంధనం ప్రపంచ ప్రాధాన్యతగా మారకముందే దానిపై నమ్మకం ఉంచి, దేశ ఇంధన స్వావలంబనకు పునాదులు వేసిన దివంగత తులసి తంతిని ఈ సందర్భంగా స్మరించుకోవాలని లోకేశ్ అన్నారు. ఆయన దార్శనికతకు అనంతపురంలోనే బలమైన పునాది పడిందని గుర్తుచేశారు. భారత పవన విద్యుత్ రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంస్థ సుజ్లాన్ అని కొనియాడారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, నిబద్ధతతో కూడిన సంస్కృతితో సుజ్లాన్ సంస్థ నిలదొక్కుకుందని ప్రశంసించారు.

గత ఐదేళ్లలో (2019-24) రాష్ట్రంలో పవన విద్యుత్ రంగం పూర్తిగా నిలిచిపోయిందని, కేవలం 6 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అదనంగా చేరిందని లోకేశ్ విమర్శించారు. నేడు ఒక్క అనంతపురంలోనే సుజ్లాన్ యూనిట్‌కు ఏటా 1,260 మెగావాట్ల తయారీ సామర్థ్యం ఉందని, ఇక్కడ ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిస్తోందని, వారిలో 70 శాతానికి పైగా స్థానికులేనని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుజ్లాన్ ఇప్పటికే 2 వేలకు పైగా గ్రీన్ ఉద్యోగాలు సృష్టించిందని వివరించారు.

ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల ద్వారా 1,325 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. దీని కోసం సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడి వస్తుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పటికే ఏపీలో సుజ్లాన్‌కు 1,600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా, మరో 2,700 మెగావాట్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 6.5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వీటికి నిరంతరాయ విద్యుత్ అందించడానికి సౌర, పవన, నిల్వ సాంకేతికతలు కలిసి పనిచేయడం అత్యంత కీలకమని లోకేశ్ అన్నారు. ఈ డిజిటల్ మౌలిక వసతుల కోసం సుమారు 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన అవకాశాలు సృష్టించవచ్చని అంచనా వేశారు.

"క్లీన్ ఎనర్జీని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియాగా మార్చి, ప్రపంచానికి ఎగుమతి చేసేలా ఏపీని 'క్లీన్ ఎనర్జీకి సౌదీ అరేబియా'గా తీర్చిదిద్దడమే మా అంతిమ లక్ష్యం," అని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధనలో సుజ్లాన్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పారిశ్రామికాభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎనర్జీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆటోమొబైల్ వంటి అధిక వృద్ధి రంగాల్లో 22 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కేవలం ఒక కంపెనీని తీసుకురావడమే కాకుండా, దాని చుట్టూ పూర్తి పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను (ఎకోసిస్టమ్) నిర్మించడమే తమ విధానమని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం, సుజ్లాన్ కలిసి 12 వేల మంది యువతకు గ్రీన్ ఎనర్జీ ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వనున్నాయని, ఇందులో 25 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని లోకేశ్ ప్రకటించారు. ఉరవకొండ, విజయవాడలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఈ రంగానికి అవసరమైన నిపుణులను సిద్ధం చేస్తాయని అన్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లే అనంతపురం జిల్లాకు ఇప్పుడు కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజ్లాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కొత్త చిరునామాగా మారాయని లోకేశ్ అన్నారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైందని, ఇతర ప్రాంతాల వారు ఉద్యోగాల కోసం అనంతపురానికి వచ్చే రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.

తన పాదయాత్రలో కియా పరిశ్రమ ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపడం చూశానని, అప్పుడే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని లోకేశ్ గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కంపెనీలను తీసుకురావడం తమ బాధ్యత అని, అవకాశాలను అందిపుచ్చుకోవడం యువత బాధ్యత అని పిలుపునిచ్చారు. "ప్రభుత్వం, పరిశ్రమలు, యువత కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఏపీపై విశ్వాసం ఉంచిన సుజ్లాన్ బృందానికి ధన్యవాదాలు. పెట్టుబడిదారులు మా ప్రభుత్వ వేగాన్ని, నిబద్ధతను నమ్మండి. స్వచ్ఛ ఇంధనం, కొత్త పరిశ్రమలు, నైపుణ్యాలతో భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం" అని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
Advertisement
Nara Lokesh
Suzlon Wind Energy
Anantapur Industrial Development
Andhra Pradesh Renewable Energy
Clean Energy Jobs AP
Suzlon Energy Investment

More Telugu News