ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం చంద్రబాబు

Justice Mallikarjuna Rao sworn in as AP Lokayukta CM Chandrababu attends
  • ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మల్లిఖార్జునరావు
  • విజయవాడలో ఆయనతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
  • కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు
ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని లోక్‌భవన్‌లో మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై, నూతన లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మల్లిఖార్జునరావుకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం జస్టిస్ మల్లిఖార్జునరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ కాసేపు ముచ్చటించారు. పరిపాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనకు లోకాయుక్త వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. అనంతరం లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ మల్లిఖార్జునరావు నియామకంతో రాష్ట్రంలో పరిపాలన మరింత జవాబుదారీగా మారుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Justice Mallikarjuna Rao
Andhra Pradesh Lokayukta
Chandrababu Naidu
Governor Abdul Nazeer
Vijayawada Lok Bhavan
Lokayukta Swearing In Ceremony

More Telugu News