గృహహింస కేసు: జోగి రమేశ్ కుటుంబానికి ఊరట

Domestic violence case Relief for Jogi Ramesh family
  • 11 మంది కుటుంబ సభ్యులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్
  • రెండు వారాల్లోగా స్టేషన్‌లో లొంగిపోవాలని కోర్టు ఆదేశం
  • జోగి రమేశ్ సహా ఐదుగురికి ప్రత్యేక షరతులు విధింపు
  • పాస్‌పోర్టులు స్వాధీనం చేయాలని ఉత్తర్వులు
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు గృహహింస కేసులో ఊరట లభించింది. వీరికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు వెలువడిన రెండు వారాల్లోగా జోగి రమేశ్‌తో పాటు మొత్తం 11 మంది నిందితులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఒక్కొక్కరు రూ. 25 వేల చొప్పున ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించి బెయిల్ పొందవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదే క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జోగి రాజీవ్ (ఏ1), జోగి రమేశ్ (ఏ2), శకుంతల (ఏ3), రేష్మా ప్రియాంక (ఏ4), రోహిత్ (ఏ5)లకు న్యాయస్థానం కొన్ని ప్రత్యేక షరతులు విధించింది. కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అలాగే, తమ పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలని, న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియకు నిందితులు పూర్తిగా సహకరించాలని కోర్టు పేర్కొంది.

జోగి రమేశ్ కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనతో పాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు కోర్టును ఆశ్రయించారు.                                
Advertisement
Jogi Ramesh
Anticipatory Bail
Domestic Violence Case
Vijayawada Women Sessions Court
YSRCP Leader
Ibrahimpatnam Police Station

More Telugu News