ఐఫోన్ ఈఎంఐ వివాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలు బలి

iPhone EMI dispute three family members die in Maharashtra
  • ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుపై ఇంట్లో తలెత్తిన వివాదం
  • కొండెక్కి ఆత్మహత్యకు యత్నించిన 18 ఏళ్ల యువకుడు
  • కాపాడబోయి కొడుకుతో పాటు లోయలో పడిపోయిన తండ్రి
  • భర్త, కొడుకు మృతితో షాక్‌లో కొండపై నుంచి దూకేసిన తల్లి
  • మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురూ మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఐఫోన్ ఈఎంఐ చెల్లింపునకు సంబంధించిన వివాదం ఒకే కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలిగొంది. నిన్న‌ జరిగిన ఈ ఘటనలో కళ్లముందే కొడుకు, భర్త చనిపోవడాన్ని చూసి తట్టుకోలేక తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు ఫోన్లలో చిత్రీకరించడంతో అవి వైరల్‌గా మారాయి.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ ఇటీవల ఒక ఐఫోన్ కొన్నాడు. దాని ఈఎంఐ చెల్లించేందుకు డబ్బుల కోసం ఇంట్లో వారితో గొడవ పడ్డాడు. ముఖ్యంగా తండ్రితో తీవ్ర వాగ్వాదం జరగడంతో, కోపంతో ఉదయం 10 గంటల సమయంలో వాలుజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని టిస్గావ్ ప్రాంతంలో ఉన్న ఓ కొండపైకి ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు.

విషయం తెలుసుకున్న కునాల్ తల్లిదండ్రులు మురళీధర్, సంగీత అక్కడికి చేరుకున్నారు. వారితో పాటు స్థానికులు, మాజీ సర్పంచ్ సంజయ్ జాదవ్ కూడా కునాల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ హైడ్రామా నడిచింది. "అమ్మైనా చూసి బతుకురా" అని ఒకరు వేడుకోగా, "లేదు, నేను చచ్చిపోవాల్సిందే" అని కునాల్ మొండికేశాడు. మరికొందరు "నీకు ఐఫోన్ 15 ప్రో మేమే కొనిస్తాం, కిందకు రా" అని బతిమాలినా ఫలితం లేకపోయింది.

మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇక లాభం లేదనుకున్న తండ్రి మురళీధర్, కొడుకును వెనక్కి లాగేందుకు కొండ అంచుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి లోయలో పడిపోయారు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన తల్లి సంగీత షాక్‌కు గురై, కొద్ది క్షణాల్లోనే ఆమె కూడా కొండపై నుంచి దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నప్పటికీ, భద్రతా వల (సేఫ్టీ నెట్) ఎందుకు ఏర్పాటు చేయలేదనే దానిపై స్పష్టత లేదు. పోలీసులు మూడు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కునాల్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Kunal
iPhone EMI dispute
Chhatrapati Sambhajinagar suicide
Maharashtra family tragedy
Tisgaon hill incident
Waluj MIDC police

More Telugu News