తెలంగాణ విద్యార్థులంటే లెక్కలేదా?.. రాహుల్ గాంధీపై కేటీఆర్, కవిత ఫైర్

Rahul Gandhi slammed by KTR and Kavitha over silence on Telangana student issues
  • విద్యార్థులపై పోలీసుల చర్యలపై రాహుల్ మౌనాన్ని ప్రశ్నించిన కేటీఆర్, కవిత
  • ఢిల్లీలో ధర్నా చేసి, తెలంగాణ ఘటనలపై స్పందించకపోవడం ద్వంద్వ వైఖరి అని విమర్శ
  • మహబూబాబాద్‌లో విద్యార్థుల గొంతు పట్టుకున్న పోలీసుల వీడియోపై ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి ఇంటి వద్ద రాహుల్ ధర్నా చేయగలరా అని కేటీఆర్ నిలదీత
తెలంగాణలో విద్యార్థులపై పోలీసుల చర్యల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసిన రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో జరుగుతున్న దాడులపై స్పందించకపోవడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వారు ఆరోపించారు.

శుక్రవారం కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ తీరును తప్పుబట్టారు. "దేశంలో రెండు రకాల భారతాలు ఉన్నాయి. ఒకచోట విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగితే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తారు, ధర్నాలు చేస్తారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణలో విద్యార్థులను ఈడ్చుకెళ్తూ, గొంతు పట్టుకొని హింసిస్తున్నా పట్టించుకోరు. ఢిల్లీ తరహాలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేస్తారా? లేక తెలంగాణ విద్యార్థులంటే మీకు లెక్కలేదా?" అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 19న మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతును ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పట్టుకున్న వీడియోను ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. "ఢిల్లీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్ కోసం వెళ్లిన రాహుల్, తెలంగాణ ఘటనలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇక్కడి విద్యార్థులను నేరస్థుల్లా చూస్తున్నారు. ఢిల్లీకి మీ ఆవేశం, తెలంగాణకు మీ మౌనం.. విద్యార్థులు మీ నుంచి ఇంతకంటే మెరుగైన తీరును ఆశిస్తున్నారు" అని కవిత అన్నారు.
Advertisement
Rahul Gandhi
KTR
Kalvakuntla Kavitha
Telangana Students
BRS vs Congress
Telangana Police Action

More Telugu News