రాజస్థాన్‌లో స్కూల్‌ తనిఖీకి వెళ్లిన కాక్రోచ్‌ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి!

Cockroach Janata Party activists attacked during Rajasthan school inspection
  • రాంపురా-కన్వర్‌పురా గ్రామంలో ఉద్రిక్తత
  • వాహనాలు, మొబైల్ ఫోన్లు ధ్వంసమైనట్లు సీజేపీ ఆరోపణ
  • మహిళా కార్యకర్తలపై కూడా దాడి జరిగిందని వెల్లడి
  • ఓ కార్యకర్త చేయి విరిగిందని అశుతోష్ రంకా ఆరోపణ
  • నిందితులను అరెస్ట్ చేయాలని సీజేపీ డిమాండ్
రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించారు.

సంగనేర్‌లోని రాంపురా-కన్వర్‌పురా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు సీజేపీ బృందం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు రంకా తెలిపారు. ఆ పాఠశాల కొన్నేళ్లుగా గేదెల కొట్టంలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. గతేడాది కూడా తమ బృందం అక్కడికి వెళ్లిందని, పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదని చెప్పారు.

తమ బృందం అక్కడికి చేరుకునేలోపే కొంతమంది బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారని, అనంతరం ఒక్కసారిగా దాడి జరిగిందని రంకా ఆరోపించారు. తమ వాహనాల అద్దాలు పగలగొట్టారని, మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని, మహిళా కార్యకర్తపై దాడి చేశారని చెప్పారు. తన చొక్కా కూడా చించివేశారని పేర్కొన్నారు. ఓ కార్యకర్త చేయి విరిగిందని, తమపై రాళ్ల దాడి కూడా జరిగిందని ఆరోపించారు.

పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా వారు ప్రేక్షక పాత్ర పోషించారని రంకా ఆరోపించారు. మహిళా కార్యకర్తలపై కూడా రాళ్లు విసిరి, వారి ఫోన్లు ధ్వంసం చేశారని చెప్పారు. ఈ దాడి ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని ఆయన ఆరోపించారు.

పాఠశాల తనిఖీలపై విధించిన ఆంక్షలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని రంకా డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈసారి పోరాటం కేవలం పాఠశాలల సమస్యలకే పరిమితం కాదని, మంత్రి మదన్ దిలావర్ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, సీజేపీ బృందం పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో స్థానిక గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పెరిగింది. ఘటనకు సంబంధించి నిందితుల వివరాలు, పోలీసుల తదుపరి చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Cockroach Janata Party
Ashutosh Ranka
Rajasthan school attack
Madan Dilawar
Sanganer school protest
Rajasthan education department

More Telugu News